మహా వ్యూహం

30 Oct, 2015 01:59 IST|Sakshi
మహా వ్యూహం

గ్రేటర్‌లో మొదలైన ఎన్నికల సందడి
 సీనియర్లను బరిలో దించాలని టీఆర్‌ఎస్ యోచన
మంత్రులకు బాధ్యతలు
అభివృద్ధి పథకాల వేగవంతం
బలాబలాలపై ప్రతిపక్షాల అంచనా
ఎవరికి వారు సమావే శాలు

 
జీహెచ్‌ఎంసీలో ఎన్నికల వేడి మొదలైంది. డీలిమిటేషన్ ముసాయిదా విడుదలై 24 గంటలు తిరగకముందే రాజకీయ వర్గాల్లో కదలిక ప్రారంభమైంది. విజయ తీరాలు చేరేందుకు వ్యూహాలు రచించే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. బలాబలాలపై అంచనాకు వస్తున్నాయి. ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఓ అడుగు ముందే ఉంది. ఎన్నికల బరిలో సీనియర్ నేతలను... ఎంపీలు... ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలైన వారిని దించాలని యోచిస్తోంది. తద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునే పనిలో పడింది. మరోవైపు అభివృద్ధి... సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఉచిత పథకాలకు... రాయితీలకు తెర తీస్తోంది.ఈ దిశగా అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ శ్రేణులు గాంధీ  భవన్‌లో సమావేశమయ్యాయి. ఎన్నికల వ్యూహంపై చర్చించాయి.
 
సిటీబ్యూరో:  ఓ వైపు బలాబలాలు... సమీకరణాల అంచనాలో రాజకీయ పార్టీలు... మరోవైపు అభివృద్ధి... సంక్షేమ పథకాలు వేగవంతం చేసే పనిలో ప్రభుత్వ వర్గాలు... ఒక్క రోజులోనే నగరంలో కనిపించిన మార్పు ఇది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో తొలిఘట్టమైన డీలిమిటేషన్ ముసాయిదా విడుదల ప్రభావమిది. డీలిమిటేషన్ వల్ల తమకు పట్టున్న ప్రాంతాలను కాకుండా చేస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ ‘మార్పు’ను అనుకూలంగా మార్చుకోవడమెలాగా అని ఆలోచిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇవన్నీ ‘సహజమే’ననే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు, కొత్త సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. డీలిమిటేషన్ పూర్తి కాగానే  వార్డుల రిజర్వేషన్లు.. అనంతరం ఓటర్ల జాబితా ప్రకటన వంటివి ఉన్నాయి. ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికంతటికీ దాదాపు 75 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈలోగా పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు నగరంలో మౌలిక సదుపాయాల నూ మెరుగుపరచాలని యత్నిస్తున్నారు. లేదంటే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లలేమని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

 సంక్షేమ పథకాలు
 సంక్షేమ, ఆకర్షక పథకాల్లో భాగంగా విద్యుత్ బిల్లు నెలకు రూ.150, నల్లాచార్జీలు నెలకు రూ.150 వంతున మాత్రమే వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో పాటు ఇంటింటికీ నాలుగేసి ఎల్‌ఈడీ బల్బులను ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 80 లక్షల దీపాలకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేయనుంది. నియోజకవర్గానికి 5వేల వంతున గ్రేటర్‌లోని మహిళలకు 1.40 లక్షల దీపం (గ్యాస్) కనెక్షన్లు అందజేయనున్నారు. నవంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రకటించారు.

మురికివాడలు, తక్కువ విస్తీర్ణంలోని ఇళ్ల వారికి ఆస్తిపన్ను కేవలం రూ.101 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించారు. ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే ప్రారంభించనున్నారు. కూకట్‌పల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. పాతబస్తీలోని మరో ఎనిమిది బస్తీల్లోనూ త్వరలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు బ్యాంకు లింకేజీలతో రుణ పంపిణీని ముమ్మరం చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు మంజూరు కాగా...  వీలైన ంత పెద్ద మొత్తాల్లో రుణాల పంపిణీకి వేగం పెంచారు.వెయ్యి జిమ్‌లు, మరో వెయ్యి ఈ-లైబ్రరీల ఏర్పాటు దిశగా కసరత్తు ఊపందుకుంది. సంక్షేవు, అభివృద్ధి పథకాల అవులుకు జీహెచ్‌ఎంసీ అధికారులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ల (ఆర్‌డబ్ల్యూఏ)తో సవూవేశాలు నిర్వహిస్తూ... వారి భాగస్వావ్యూన్ని పెంచుతున్నారు.
 
ఇంటింటికీ చెత్త సేకరణకు రెండు రంగుల డబ్బాలు, చెత్తను ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలించేందుకు నిరుద్యోగులకు బ్యాంకు రుణాలతో (అర్హులకు సబ్సిడీలతో) 2వేల ఆటోటిప్పర్లు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రెండు మూడు రోజుల్లో ప్రారంభించనున్నారు. పీపుల్స్‌ప్లాజాలో ఈ కార్యక్రమ నిర్వహణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ గురువారం స్థలాన్ని పరిశీలించి వచ్చారు. డ్రైవర్ కమ్ ఓనర్ ద్వారా మలిదశ కార్ల పంపిణీకి కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
 అభివృద్ధి కార్యక్రమాలు
 
నగరంలోని వీలైనన్ని మార్గాల్లో రహదారులను యుద్ధ ప్రాతిపదికన రీకార్పెటింగ్‌కు సిద్ధమయ్యారు. బీటీ, వైట్‌టాపింగ్ రోడ్లకు  ఇప్పటికే టెండర్లు పిలిచారు. వెయ్యి కిలోమీటర్ల బీటీ రోడ్లు, 400 కి.మీ.ల వైట్‌టాపింగ్ రోడ్లకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నారు. రహదారులను శుభ్రపరిచేందుకు 18 భారీ స్వీపింగ్ యంత్రాలు సమకూర్చుకుంటున్నారు. స్లమ్స్, పాతబస్తీలోని ఇరుకుమార్గాల్లో బ్యాటరీతో నడిచే చిన్నసైజు ఆటోట్రాలీలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
     
మల్టీపర్పస్ హాళ్లు, మోడల్ మార్కెట్లు, పార్కుల అృవద్ధి, చెరువుల సుందరీకరణ, శ్మశానవాటికల అృవద్ధికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. వీటి అంచనా దాదాపు రూ.1000 కోట్లు. స్వచ్ఛ హైదరాబాద్‌లో అందిన విజ్ఞప్తుల మేరకు ఇంకా మూడువేల పనులు త్వరగా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌లోగా వీలైనన్ని ఎక్కువ పనులు చేయాలని భావిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు