నేనొస్తున్నా!

5 Jan, 2016 00:07 IST|Sakshi
నేనొస్తున్నా!

నేటి నుంచి గ్రేటర్‌లో షర్మిల యాత్ర తొలిరోజు
కుటుంబాలకు పరామర్శ చందానగర్, షాపూర్ నగర్‌లలో బహిరంగ సభలు
5, 6, 7 తేదీల్లో 17 కుటుంబాలకు భరోసా

 
సిటీబ్యూరో: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మర ణ వార్తను తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు... బడుగు ప్రజలకు రాజన్న బిడ్డగా    ‘నేనున్నాన’ంటూ భరోసా ఇచ్చేందుకు... మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత   వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గ్రేటర్‌లో తొలిసారిగా మంగళవారం నుంచి పర్యటించబోతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరామర్శ యాత్రకు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు తమ అభిమాన నేత రాజన్న బిడ్డ షర్మిలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి.

తొలి రోజు ఇలా...
ఈ నెల 5న (మంగళవారం) ఉదయం 9 గంటలకు లోటస్ పాండ్ నుంచి షర్మిల బయలుదేరుతారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45, మాదాపూర్ పీఎస్, హైటెక్ సిటీ ఫ్లైవర్ కింద నుంచి కొండాపూర్, మియాపూర్, చందానగర్‌ల మీదుగా తారానగర్ తుల్జాభవన్ దేవాలయ సమీపంలోని దిగంబరరావు ఇంటికి చేరుకుంటారు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఉదయం 10.30 గంటలకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుంది. ఉదయం 11.30 గంటలకు కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ ఫస్ట్ ఫేజ్ చౌరస్తా సమీపంలో ఉన్న సన్నిధి కృష్ణ కుటుంబ సభ్యులను  పరామర్శిస్తారు. ఆ తర్వాత 12.30కి కూకట్‌పల్లి రామాలయం సమీపంలోని టి.రణతేజ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మూసాపేట గాంధీ చౌరస్తా సమీపంలోని నోముల రాజయ్య ఇంటికి చేరుకుంటారు.

2.30 గంటలకు షాపూర్ నగర్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి... అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. లెఫ్ట్ రోడ్డులో షాపూర్‌నగర్‌లోని దామా నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి... కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 3.30 గంటలకు సుభాష్ నగర్‌లోని వెంకట రమణరాజు ఇంటికి చేరుకుంటారు. ఆ తర్వాత దూలపల్లిలో సురకంటి రమేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మౌలాలి ఉల్ఫత్ నగర్‌లో అబ్దుల్ రహమాన్ కుటుంబాన్ని పరామర్శించి లోటస్ పాండ్‌కు చేరుకుంటారు. రెండు, మూడో రోజుల పరామర్శ యాత్ర షెడ్యూల్‌ను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ చెప్పారు.

మరిన్ని వార్తలు