హైకోర్టులో గౌలివాడ రైతుల అత్యవసర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ మండలం గౌలివాడ గ్రామంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ పంప్హౌస్ విషయంలో ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ పలువురు రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అధికారు లు బలవంతంగా తమ భూముల నుంచి ఖాళీ చేయించడమే కాక, పంప్హౌస్ పనులు కొనసాగిస్తూ పంటలను నాశనం చేస్తున్నారని గుడి వెంకటరెడ్డి, మరో ఐదుగురు రైతులు శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఆయన ఇంటి వద్దే విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున బి.రచనారెడ్డి, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని శనివారానికి వాయిదా వేశారు.