‘హ్యాక్’ చేసి..అరెస్టయ్యారు

25 Aug, 2015 15:02 IST|Sakshi
‘హ్యాక్’ చేసి..అరెస్టయ్యారు

బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మళ్లింపు
పరారీలో ప్రధాన సూత్రధారి

 
సాక్షి, సిటీబ్యూరో : ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాల హ్యాకింగ్,  ఫోన్ నంబర్‌ను క్లోనింగ్ చేసి నగదు బదిలీలు చేసేందుకు అంతర్రాష్ట మోసగాళ్లకు సహకరిస్తున్న ఇద్దరిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి సోమవారం తీసుకొచ్చారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ ప్రభాకర్ రావు కథనం ప్రకారం.. తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను హ్యాక్ చేసి సికింద్రాబాద్‌లోని ఎస్‌డీ రోడ్డులో ఉన్న విజయబ్యాంక్‌లోని ఖాతా నుంచి రూ.10,75,000 బదిలీ చేశారని యూనియన్ రోడ్డువేస్ యాజమాన్యం మే 15న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రూ.8,75,000 కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంక్‌కు, గోరఖ్‌పూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ 2,00,000 బదిలీ అయ్యాయని విచారణలో తేలింది. దీంతో కోల్‌కతాకు పోలీసు బృందం వెళ్లి...లబ్ధిదారుడైన అకౌంట్ హోల్డర్ మమతా మయీ సెంటర్ ప్రొఫెసర్ దేబశీష్ ఛటర్జీ, బెహలాకు చెందిన జోయ్‌దీప్ దత్తాను పట్టుకున్నారు.

జోగీందర్ శర్మే సూత్రధారి..
ఖాతాదారుల కరెంట్ అకౌంట్ వివరాలతో పాటు చెక్‌బుక్‌లు, డెబిట్‌కార్డులు ఇస్తున్న వారికి మూడు శాతం కమీషన్, వీరిని చూపించిన మధ్యవర్తి జోయ్‌దీప్‌దత్తాకు  పది శాతం కమీషన్‌ను కోల్‌కతాకే చెందిన జోగీందర్ శర్మ అలియాస్ జోగీ రాజ్ చెల్లిస్తున్నాడు. ఈ ఖాతా వివరాలను సేకరించాక వినియోగదారుల నెట్ బ్యాంకింగ్‌ను హ్యాక్ చేసి, అందులో ఉన్న సెల్‌ఫోన్ నంబర్‌ను క్లోనింగ్ చేసి డూప్లికేట్ సిమ్‌తో బ్యాంక్ నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌లను పొందుతున్నాడు.

మోసపూరితంగా సదరు ఖాతాల నుంచి డబ్బులను ఇతర ఖాతాలోకి మళ్లిస్తున్నాడు. జోయ్‌దీప్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో కోల్‌కతాకు చెందిన 43 మంది ఖాతాదారుల వివరాలు ఉన్నాయి. నిందితుల నుంచి 16 చెక్‌బుక్‌లు, 14 డెబిట్ కార్డులు, రెండు రబ్బర్ స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సూత్రధారుడైన జోగీందర్ శర్మ పరారీలో ఉన్నాడు.
 

>
మరిన్ని వార్తలు