సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మొదటివారంలో మొదలుకానున్న మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న మొక్కల వివరాలపై అటవీశాఖ ఒక హ్యాండ్ బుక్ను రూపొందిస్తోంది. త్వరలోనే జిల్లాల వారీగా నర్సరీ డైరెక్టరీలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విడత హరితహారం ప్రత్యేకత, ఏయే మొక్కలు ఎక్కడెక్కడ దొరుకుతాయన్న వివరాలను దీనిలో పొందుపరుస్తున్నారు. ఒక్కో జిల్లాలోని నర్సరీల వివరాలు మండలాలు, గ్రామాల వారీగా ఆయా నర్సరీల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మొక్కల వివరాలు, ఆ నర్సరీ ఏ మండలానికి, గ్రామానికి అనుసంధానం చేయబడిందన్న వివరాలు ఇందులో ఉంటాయి.
దీనిని హరితహారానికి సంబంధించిన ప్రతి అధికారి వద్ద అందుబాటులో ఉంచటంతో పాటు, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మంత్రి మొదలుకుని ఎమ్మెల్యే, సర్పంచ్ దాకా ఈ పుస్తకాన్ని చేరవేయనున్నారు. మొక్కలను నాటడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంరక్షణ చర్యలు, తదితరాలను పొందుపరుస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏ జిల్లాకు ఆ జిల్లాలో నాటాల్సిన మొక్కల లక్ష్యం ఎంత, ఏ ఏ మొక్కలు ఏ నర్సరీలో ఉన్నాయి వాటి సంఖ్య లాంటి వివరాలు కూడా ఈ హ్యాండ్ బుక్ లో ఉంటాయి. ఒక్కో జిల్లాకు ఇక ప్రత్యేక బుక్ లెట్ అంటుబాటులో తెచ్చే ప్రయత్నం అటవీ శాఖ చేస్తోంది. ఆ జిల్లాకు సంబంధించిన నర్సరీలు, వాటి ఇన్చార్జీల పేరు, సెల్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది.