ఒక్కరోజులో 31 వేల కేసుల పరిష్కారం

24 Apr, 2018 02:10 IST|Sakshi

తెలంగాణ, ఏపీల్లో లోక్‌అదాలత్‌ల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వ హించిన లోక్‌అదాలత్‌లకు మంచి స్పందన లభించింది. ఒక్క రోజులోనే 31,733 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ వల్ల బాధితులకు రూ.81.33 కోట్ల మేర పరిహారాన్ని ప్రకటించారు. వీటిలో అత్యధికంగా తెలంగాణలో రూ.56.02 కోట్లు అందింది. ఏపీలో రూ.25.31 కోట్లు పరిహారం ప్రకటించారు. కేసుల సంఖ్య పరంగా చూస్తే అత్యధికంగా ఏపీలో 18,891 కేసులు పరిష్కారమయ్యాయి.

తెలంగాణలో 12,842 కేసుల్లో రాజీ చేసుకున్నాయి. వీటిలో 6,988 కేసులు ప్రాథమిక విచారణ దశలో ఉండగా, 5,854 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బి.ఆర్‌.మధుసూదన్‌రావు తెలిపారు. ఏపీలో పరిష్కారమైన కేసుల్లో 14,404 పెండింగ్‌లో ఉన్నవి కాగా, 4,487 కేసులు ప్రాథమిక విచారణ దశలో ఉన్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పీవీ రాంబాబు తెలిపారు.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి వరకు లోక్‌అదాలత్‌లు నిర్వహిం చారు. హైకోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో 58 కేసులు పరిష్కారం కాగా, బాధితులకు రూ.3 కోట్లు పరిహారం ప్రకటించారు.

హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్, న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జీవీ సీతాపతిలతో కూడిన ధర్మాసనాలు ఈ కేసులను పరిష్కరించినట్లు హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యదర్శి రమేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు