‘మిడ్‌మానేరు’ అక్రమార్కులపై కేసులు

7 Jan, 2018 02:06 IST|Sakshi

ప్రాజెక్టుపై సమీక్షలో మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: మిడ్‌మానేరు భూ నిర్వాసితుల నష్టపరిహారం కోసం తప్పుడు అఫిడవిట్లు సమ ర్పించిన అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. నిర్వాసితుల నష్ట పరిహారం చెల్లింపుల్లో అవకతవ కలు జరగకుండా చూడాలని, ముంపునకు గుర య్యే నిర్మాణాల అంచనాలు రూపొందించడంలో అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో మిడ్‌మానేరు పనుల పురోగతి, భూ నిర్వాసితుల నష్టపరిహారం, పునరావాస కార్యక్రమాలపై హరీశ్‌ సమీక్షించారు.

పరిహారాల్లో అవకతవకలు, రికార్డుల తారుమారు, వాటి నిర్వహణ వంటి అంశాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన నటరాజ్‌ అనే అధికారి నిర్వాకం వల్ల పరిహార చెల్లింపులు ఆలస్యమయ్యాయని, రికార్డుల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్‌ పేర్కొనడంతో ఆ అధికారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని హరీశ్‌ ఆదేశించారు. మిడ్‌మానేరు కింద ముంపునకు గురవుతున్న 7,419 ఇళ్లలో ఇప్పటికే 3 వేలకుపైగా ఇళ్లు నిర్మించామని, మరో 1,500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు కలెక్టర్‌ వివరించారు.

మిగతా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్‌ ఆదేశించారు. ఇప్పటికే 7,159 ఇళ్లకు పరిహారం పూర్తయిందని, మిగతా ఇళ్ల పరిహారాన్ని వారంలో చెల్లించాలని కలెక్టర్‌కు సూచించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ముంపు గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రజలు ఇంకా ఇళ్లు ఖాళీ చేయలేదని అధికారులు వివరించగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు.

నిర్వాసితులకు ఇందిరా ఆవాస్‌ యోజన కింద నిధులు మంజూరు చేయాలని హౌసింగ్‌ ఎండీ చిత్రా రామచంద్రన్‌ను మంత్రి ఆదేశించారు. నిర్వాసితుల గృహ నిర్మాణాలకు నష్టపరిహారం కింద రూ. 40 కోట్లు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం మరో రూ. 25 కోట్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద 1,200 కోట్లు చెల్లించామన్నారు.
 
వచ్చే నెల 15లోగా ప్రాజెక్టు పనులు పూర్తి...
మిడ్‌మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా సివిల్, మెకానికల్, సాంకేతిక పనులన్నీ ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నందున మిడ్‌మానేరు పూర్తి కావడం కీలక మన్నారు. మొత్తం 25 గేట్ల ఫ్యాబ్రికేషన్, బిగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు పరిధిలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు