పనామా దెబ్బ..

14 May, 2016 03:13 IST|Sakshi

- హెరిటేజ్‌కు మోటపర్తి రాజీనామా

 

సాక్షి, హైదరాబాద్: తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు విదేశాల్లోని అనుమానాస్పద కంపెనీలతో ఉన్న లింకుల్ని పనామా పత్రాలు వెల్లడించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నష్టనివారణ చర్యలకు దిగారు. మోటపర్తితో తక్షణం పదవికి రాజీనామా చేయించారు.

 

ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్‌కెమీ వెంచర్స్ వంటి ఆఫ్‌షోర్ కంపెనీలతో ప్రసాద్‌కున్న లింకుల్ని పనామా పత్రాలు వెల్లడించడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించడం తెలిసిందే. మనీలాండరింగ్ కోసం, పన్నుల ఎగవేతకోసం ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న కంపెనీలపై పనామా పేపర్స్ లీకులిస్తున్న విషయం విదితమే. ఈ వరసలోనే హెరిటేజ్‌లో డెరైక్టర్‌గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ అల్లిబిల్లి కంపెనీల వ్యవహారం కూడా వెలుగు చూసింది.

 

ఈ నేపథ్యంలో.. కుటుంబసభ్యులతోసహా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన మోటపర్తితో హెరిటేజ్ డెరైక్టర్ పదవికి హుటాహుటిన రాజీనామా చేయించారు. మోటపర్తి గురువారం తన పదవికి రాజీనామా చేశారని హెరిటే జ్ కంపెనీ కార్యదర్శి ఉమాకాంత్ బారిక్ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు రాసిన లేఖలో  తెలిపారు. ఈనెల 23న జరిగే కంపెనీ డెరైక్టర్ల సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. బాబుతో అత్యంత సాన్నిహిత్యం..: చంద్రబాబుకు, మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు మధ్య ఎంతోకాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రబాబుతో మోటపర్తి అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు.

 

2014, జూన్‌లో చంద్రబాబు రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే మోటపర్తిని ఐదేళ్ల కాలానికి హెరిటేజ్ ఫుడ్స్‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో పనామా పత్రాల్లో మోటపర్తి పేరు వెలుగులోకి రావటం ఏపీ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

మరిన్ని వార్తలు