హే గాంధీ!

20 Sep, 2016 00:19 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్‌: గాంధీ జనరల్‌ ఆస్పత్రికి సుస్తీ చేసింది. నయం చేయాల్సిన ప్రభుత్వం తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో అత్యవసర విభాగానికి చేరుకున్నా... సకాలంలో వైద్యం అందక ... వ్యాధి నిర్ధారణ యంత్రాలు పని చేయక... ఎంతో మంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. 1255 పడకల సామ«ర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఔట్‌ పేషెంట్‌ విభాగానికి నిత్యం 2500–3000 మంది వస్తుండగా.. ఇన్‌పేషెంట్‌ విభాగంలో 1500 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు సగటున 200 మంది వస్తే... వీరిలో 80 శాతం రక్తమోడుతున్న వారే. వీరిలో చాలా మందికి సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. నిపుణులు అందుబాటులో లేక కొంతమంది... సీటీ, ఎంఆర్‌ఐ వంటి సేవలు అందక మరికొంతమంది చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
పని చేయని సీటీస్కాన్‌
ఆస్పత్రిలోని సీటీస్కాన్‌ యంత్రం ఐదు రోజులుగా పని చేయడం లేదు. దీనికి మరమ్మతులు చేయాలంటే జర్మనీ నుంచి ప్రత్యేక నిపుణులు రావాల్సిందే. సకాలంలో నిర్వహణ ఖర్చులు చెల్లించక పోవడంతో సదరు సంస్థ ప్రతినిధులు మరమ్మతులకు ముందుకు రావడం లేదు. దీంతో రోగులను వైద్యులు ఉస్మానియాకు సిఫారసు చేస్తున్నారు. తీరా అక్కడి సీటీస్కాన్‌కు 15 రోజులు... ఎంఆర్‌ఐకి రెండు నుంచి మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా గాంధీలోనే ప్రస్తుతం 400 మందికిపైగా ఎంఆర్‌ఐ కోసం ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు