ఏం చర్యలు తీసుకొంటున్నారో చెప్పండి

8 Aug, 2017 03:31 IST|Sakshi
జంతు పరిరక్షణ కమిటీల నిర్వహణపై ప్రశ్నించిన హైకోర్టు 
 
సాక్షి, హైదరాబాద్‌: జంతు పరిరక్షణకు, జంతు హింస నిరోధానికి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమిటీల పనితీరు, వాటి సక్రమ నిర్వహణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది. అక్రమ రవాణాలో పట్టుబడ్డ జంతువులకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రక్షిత ప్రదేశాలు, నీరు, దాణా తదితరాల కోసం ఎంత మొత్తంలో నిధులు కేటాయించారన్న వివరాలను తమ ముందుంచాలంది.

తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంతు హింస నిరోధానికి ప్రతీ జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడంలేదంటూ యానిమల్‌ రెస్కూ ఆర్గనైజేషన్, మరికొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.  ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జంతు పరిరక్షణకు, జంతు హింస నిరోధానికి కమిటీలను ఏర్పాటు చేశామని,  వాటికి నిధులను కూడా మంజూరు చేస్తున్నామని విన్నవించారు. 
>
మరిన్ని వార్తలు