ఎన్నికల పిటిషన్ను కొట్టేయాలన్న అభ్యర్థన తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో చుక్కెదురైంది. గీత ఎస్టీ కాదని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో తన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేయాలంటూ గీత చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తపల్లి గీత ఎస్టీ కాదని.. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఎస్టీగా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్లో ఉండగానే, దీనిని కొట్టేయాలని కోరుతూ కొత్తపల్లి గీత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి.. గీత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేశారు.