సాక్షి, హైదరాబాద్ : మీరు వెళుతున్న రహదారిని పొగమంచు కప్పేసింది. వాహనలైట్లు, ఇండికేటర్స్ వేసుకుని 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ముందుకెళ్లాలి. వాహన చోదకులను జాగృతం చేసేలా భారీ సైన్ స్క్రీన్పై ప్రొజెక్ట్ అయ్యే హెచ్చరిక ఇదీ..
మీరు వెళుతున్న మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, అంబు లెన్స్కు సమాచారమివ్వాలంటే సెల్ సిగ్నల్ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి కిలోమీటర్కు ఒక ఎమర్జెన్సీ కాల్ బాక్స్తో ఫోన్కాల్ చేసే సదుపాయం ఇదీ..
..ఇవేకాక మరిన్ని నవీకరణ ఆలోచన లతో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై జర్నీ సాఫీగా సాగేలా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల ప్మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నానక్ రామ్ గూడలోని ట్రాఫిక్ కమాండ్ సెంటర్ ద్వారా ఓఆర్ఆర్పై ప్రతి కదలికను ఎప్పటి కప్పుడు తెలుసుకోవడంతో పాటు ఏ ఘటన జరిగినా క్షణాల్లో స్పందించి వాహనచోదకుల భద్రతకు పెద్దపీట వేసేలా ముందుకెళు తోంది.
వాటర్ స్ప్రే.. ఎల్ఈడీ వెలుగులు
చాలా రోడ్డు ప్రమాదాలు డ్రైవర్లు అతివేగంతో వెళ్లే సమయాల్లో కునుకు తీయడం వల్లే చోటుచేసుకుంటున్నాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తు రాకుండా ఉండేందుకు టోల్బూత్ వద్ద సిబ్బంది డ్రైవర్ల ముఖాలపై వాటర్ స్ప్రే చేయనున్నారు. దీని వల్ల డ్రైవర్ల నిద్రమత్తు వదిలి రోడ్డు ప్రమాదాలు జరిగే చాన్స్ ఉండదు. అలాగే వాహనచోదకుల కోసం రెస్ట్రూమ్స్, టాయ్లెట్స్, డ్రింకింగ్ వాటర్ను కల్పించేందుకు పెద్ద అంబర్పేటలో ప్రయో గాత్మకంగా ‘వే సైడ్ ఎమినిటీస్’ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్ మోహన్ చెబుతున్నారు. రాత్రి వేళల్లో వెలుతురు సరిగా లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమని భావిస్తున్న హెచ్ఎండీఏ.. తొలివిడతగా 24.2 కిలోమీటర్ల గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఎల్ఈడీ బల్బులు అమరుస్తోంది.
సైన్ స్క్రీన్ బోర్డులు..
156.9 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్లో దాదాపు 40కిపైగా విభిన్న ఆకృతుల్లో సైన్ స్క్రీన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మెటాలాజి కల్ సెన్సార్స్, పొగమంచు, వెలుతురు మంద గించడం, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, భారీ వర్షం కురిసినప్పుడు.. వాహనచోదకులను అప్రమత్తం చేసేందుకు సైన్ స్క్రీన్ బోర్డులపై ఆ సమాచారాన్ని డిస్ప్లే చేస్తారు.
24/7 సేవలు..
ట్రాఫిక్ కమాండ్ సెంటర్ సిబ్బంది 24 గంటలు ఏడు రోజుల పాటు విధుల్లో ఉంటారు. ఓఆర్ఆర్ నుంచి వచ్చే సమాచారాన్ని తెలుసుకుని అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు. కిలోమీటర్కు ఏర్పాటుచేసే ఎమర్జెన్సీ కాల్స్ బాక్స్ ద్వారా వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకుని సహాయమందేలా చూస్తారు. రోడ్డు ప్రమాదాలైతే అంబులెన్స్ పంపు తారు. ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందిస్తారు.
ప్రతిదీ పర్యవే‘క్షణమే’..
ట్రాఫిక్ కమాండ్ సెంటర్ ద్వారా ఓఆర్ఆర్లో జరిగే ప్రతి దృశ్యాన్ని పర్యవేక్షించనున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతు న్నట్టు గుర్తించిన ఇంటర్ఛేంజ్ల వద్ద 50కి పైగా సీసీటీవీ కెమెరాలను బిగించనున్నారు. అలాగే టోల్ మేనేజ్మెంట్ సిస్టమ్లో భాగంగా పనిచేస్తున్న టోల్ ప్లాజాల వద్ద కొన్ని వాహ నాలకు టోల్ వసూలు చేసి, మరికొన్ని వాహనాలను డబ్బులు తీసుకొకుండానే వదిలేయడం జరుగుతోంది. కొన్ని వాహనదారుల వద్ద గంపగుత్తగా మాట్లాడి నెల రోజుల్లో ఒక్కసారి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు టోల్ ప్లాజాల వద్ద 180 సీసీటీవీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు హెచ్ఎండీఏ చెబుతోంది.
ఆరు నెలల్లో అందుబాటులోకి..
వాహనచోదకుల భద్రత కోసం సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఔటర్పై సాఫీగా ప్రయాణం చేసేలా సైన్ స్క్రీన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నాం. కిలోమీటర్కొక ఎమర్జెన్సీ కాల్ బాక్స్ను ఏర్పాటు చేస్తున్నాం. టోల్ప్లాజా, ఇంటర్ చేంజ్ల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కమాండ్ సెంటర్కు అనుసంధానం చేసి నిఘా ఉంచుతాం. హెచ్టీఎంఎస్ సేవలు జూన్ నెలాఖరుకు అందుబాటులోకి వస్తాయి.
– చిరంజీవులు,హెచ్ఎండీఏ కమిషనర్