సమావేశానికి ఒట్టిచేతుల్తో వస్తే ఎలా..!

10 Jan, 2014 03:44 IST|Sakshi
  • ఆర్డీవో, హౌసింగ్ పీడీలపై కలెక్టర్ ఆగ్రహం
  •  వాడీవేడిగా హౌసింగ్ సమీక్ష
  •  
    సాక్షి, సిటీబ్యూరో: ‘ఇళ్ల నిర్మాణం ఎందుకు పూర్తికాలేదంటే.. కోర్టు కేసులని సాకులు చెబుతారు. కేసుల సంగతి అడిగితే రికార్డులు లేవంటారు. సమీక్షా సమావేశానికి చేతులూపుకుంటూ వస్తారా?’.. అంటూ హౌసింగ్ పీడీ, హైదరాబాద్ ఆర్డీవోపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న హౌసింగ్ ప్రాజెక్టులపై వివిధ మండలాల తహశీల్దార్లు, ఆర్డీవోలు, హౌసింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు.

    హైదరాబాద్  డివిజన్‌లోని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులు నత్తనడక సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు కేసులుంటే త్వరగా పరిష్కరించుకోవాలని, కేసులు లేని చోట్ల లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే(ఎస్‌ఈఎస్)ను వెంటనే పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు.

    జీవో లేకపోవడంపై మందలింపు
     
    నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆ శాఖ అధికారులు స్టాంప్ డ్యూటీ చెల్లించమంటున్నారని.. గతంలో పేదల ఇళ్లకు ఉచితంగా రిజి   స్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని సైదాబా     ద్ తహశీల్దారు కలెక్టర్‌కు దృష్టికి తెచ్చారు. ఉచిత రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో మీవద్ద ఉందా.. అని హౌసింగ్ పీడీని, హైదరాబాద్ ఆర్డీవోను కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమలడంతో కలెక్టర్ మరోమారు కోపగించుకున్నారు. ఉచిత రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నట్లైతే, ఆశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేలా చూస్తానని తెలిపారు.
     
    ల్యాండ్ బ్యాంక్ .. జాగ్రత్త!
     
    జిల్లా వ్యాప్తంగా ల్యాండ్ బ్యాంక్‌లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ముఖేష్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై శుక్రవారం జరగనున్న సమావేశానికి సమగ్ర వివరాలతో రావాలని తహశీల్దార్లను, ఆర్డీవోలకు సూచించారు. సమావేశంలో.. హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీధర్, హైదరాబాద్ ఆర్డీవో నవ్య, సికింద్రాబాద్ ఆర్డీవో కిషన్, అన్ని మండలాల తహశీల్దార్లు, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ విభాగాల ఇంజినీర్లు పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు