తెలుగు రాష్ట్రాల్లో 38377 ఉపాధ్యాయ ఖాళీలు

1 Aug, 2016 01:50 IST|Sakshi
తెలుగు రాష్ట్రాల్లో 38377 ఉపాధ్యాయ ఖాళీలు

తెలుగు  రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి సమర్పించిన నివేదికలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ వివరాలు వెల్లడించాయి.

తెలంగాణలో 16,193 టీచర్ పోస్టులు ఖాళీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 16,193 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో (1 నుంచి 8వ తరగతి వరకు) 13,049 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 3,144 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో 35.79 శాతం స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరని వివరించింది.

ఆంధ్రప్రదేశ్లో 22,184 ఉపాధ్యాయ ఖాళీలు
‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలి’ అని కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది మార్చినాటికి ఏకంగా 22,184 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో ప్రాథమిక స్కూళ్లలో(1 నుంచి 8వ తరగతి వరకు) 17,128 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 5,056 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో సగటు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 18గా ఉందని, 32.03 శాతం ప్రాథమిక పాఠశాలల్లో నిబంధనల మేరకు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి అమలు జరగడం లేదని కేంద్రం వెల్లడించింది.

వివిధ రాష్ట్రాలు సమర్పించిన నివేదికల ఆధారంగా కేంద్రం దేశవ్యాప్తంగా స్కూళ్లలోని పరిస్థితిపై లెక్కలు కట్టింది. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో ఏకంగా 8.33 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఇక దేశంలోని మొత్తం స్కూళ్లలో 8.5 శాతం పాఠశాలలు ఒకే టీచర్‌తో కొనసాగుతున్నాయి. 64 శాతం స్కూళ్లలో ప్రధాన సబ్జెక్టులకు టీచర్లు లేరు. 16 రాష్ట్రాల్లో శిక్షణ పొందని టీచర్లు పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉన్నారు. టీచర్ పోస్టుల భర్తీతోపాటు స్కూళ్లలో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు