భార్య ప్రియుడి దాడి: భర్త మృతి

19 Apr, 2016 14:17 IST|Sakshi

హైదరాబాద్: భార్య ప్రియుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్త చికిత్సపొందుతూ మృతి చెందాడు. బంజారాహిల్స్ ఎస్‌ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. జాఫర్ (30) తన భార్యాబిడ్డలతో హకీంపేట కుంట ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరింటికి సమీపంలో ఉండే జగన్(35) జాఫర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

కాగా ఈనెల 11న జాఫర్.. అతని భార్య మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించారు. తిరిగి 13వ తేదీ రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో జాఫర్ మద్యం మత్తులో ఉన్నాడు. జాఫర్ భార్య జగన్‌కు విషయం చెప్పి రావాలని కోరింది. అప్పటికే జగన్ మద్యం తాగి ఉన్న అతను వచ్చాడు. జాఫర్.. జగన్‌ల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన జగన్.. జాఫర్‌ను పట్టుకొని పక్కనే ఉన్న బీరువాకు కొట్టాడు.

జాఫర్ మెడకు బలమైన దెబ్బ తగలడంతో పాటు నరాలు దెబ్బతిన్నాయి. వెన్నుపూస ప్రాంతంలో తీవ్ర గాయమైంది. 13, 14 తేదీల్లో ఇంట్లోనే ఉన్న జాఫర్ పరిస్థితి విషమించింది. మాట పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే జాఫర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న జాఫర్ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోలీసులు ఐపీసీ 304 కింద కేసు నమోదు చేసి జగన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు