భార్య మరొకరితో వెళ్లిపోయిందని..

23 Jul, 2017 17:05 IST|Sakshi
భార్య మరొకరితో వెళ్లిపోయిందని..

ఉప్పల్‌(హైదరాబాద్‌ సిటీ): భార్య మరొకరితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. చిలుకానగర్‌ కుమ్మరికుంట ప్రాంతానికి చెందిన కనికటి యాకయ్య(31)కు రవళి(22)తో నెల క్రితం వివాహం జరిగింది. కుమ్మరికుంటలో కాపురం పెట్టారు. కొద్దిరోజులు సాఫీగానే జరిగిన వీరి సంసారంలో చిచ్చు మొదలైంది. ఈ నెల 21వ తేదీన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన రవళి నగలను సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన భర్త ఈ నెల 22వ తేదీన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ మధ్యలో భర్తకు ఫోన్‌ చేసిన భార్య రవళి తాను మరొకరితో వెళ్లిపోతున్నానని చెప్పడంతో జీర్ణించుకోలేక మనస్తాపం చెంది విషం తాగి ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ వైపు నడుచుకుంటూ వెళ్లున్నాడు.  మార్గమధ్యంలోనే నోట్లో నుంచి నురగలు కక్కుతూ రోడ్డు మీద పడిపోయాడు. స్థానికులు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యాకయ్య మృతిచెందాడు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు