హైదరాబాద్ సంచలన విజయం

20 Aug, 2014 02:50 IST|Sakshi
హైదరాబాద్ సంచలన విజయం

ఆశిష్ సెంచరీ, రాణించిన హసన్  బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ
చెన్నై: అఖిల భారత బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో ముంబై నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని 9 ఓవర్ల ముందే ఛేదించింది. 403 పరుగుల విజయలక్ష్యంతో మంగళవారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 91 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి (134 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. లోయర్ ఆర్డర్‌లో స్పిన్నర్ మెహదీ హసన్ (92 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అనూహ్య బ్యాటింగ్ ప్రదర్శనతో ఆశిష్‌కు అండగా నిలిచాడు.

ఒక దశలో 241/7 స్కోరుతో జట్టు ఓటమి దిశగా పయనించింది. అయితే ఆశిష్, హసన్ ఎనిమిదో వికెట్‌కు 29.2 ఓవర్లలో అభేద్యంగా 163 పరుగులు జోడించి హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేశారు. తన్మయ్ అగర్వాల్ (66 బంతుల్లో 62; 13 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోగా... కెప్టెన్ అక్షత్ రెడ్డి (55 బంతుల్లో 41; 7 ఫోర్లు), ఆకాశ్ భండారి (68 బంతుల్లో 36; 6 ఫోర్లు), కొల్లా సుమంత్ (57 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. సందీప్ రాజన్ (22), హబీబ్ అహ్మద్ (10), వంశీవర్ధన్ రెడ్డి (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హెచ్‌ఎస్ బద్ధన్ 5 వికెట్లు పడగొట్టాడు. గురువారం మొదలయ్యే తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్, గుజరాత్‌తో తలపడుతుంది.

మరిన్ని వార్తలు