నేను లాడెన్‌ను.. నేను రాముడ్ని!

21 Aug, 2015 01:01 IST|Sakshi
నేను లాడెన్‌ను.. నేను రాముడ్ని!

హైదరాబాద్: ‘నేను ఒసామా బిన్ లాడెన్‌ను.. నేను రాముడ్ని.. నేనే దేవుడ్ని..’ అంటూ గురువారం ఉదయం హైదరాబాద్ కోఠిలోని గాంధీ జ్ఞాన్ మందిర్ వద్ద ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్‌కుమార్(35) కొన్నేళ్లుగా నగరంలోని చప్పల్‌బజార్‌లో నివాసం ఉంటూ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని దేనా బ్యాంక్‌లో అకౌంట్స్ ఉన్నతాధికారిగా పని చేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో బ్యాంక్ అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు.

గురువారం ఉదయం కోఠి గాంధీ జ్ఞాన్ మందిర్ వద్దకు వచ్చిన రామ్‌కుమార్.. ఇనుప రాడ్‌ను పట్టుకుని అక్కడ రోడ్డుపై వెళ్తున్న ప్రజలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో టోలీచౌకికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సమీఉద్దీన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుస్టేషన్‌లోనూ అతడు వీరంగం సృష్టించాడు. దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబడి.. నేను దేవుడ్ని.. వెల్ ఎడ్యుకేటెడ్‌ని అని అరుస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి 20 మంది పోలీసులు కలసి అతడికి బేడీలు వేసి కట్టడి చేశారు.
 
 

మరిన్ని వార్తలు