గ్రూప్‌ భళి... అడ్మిన్ బలి - తేడా వస్తే..

14 Oct, 2015 00:42 IST|Sakshi
గ్రూప్‌ భళి... అడ్మిన్ బలి - తేడా వస్తే..

గ్రూప్‌ భళి... అడ్మిన్ బలి - తేడా వస్తే..ల్లో అశ్లీల,  అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలు
తెలిసీ తెలియక షేర్ చేస్తున్న ‘సోషల్ వినియోగదారులు’
గ్రూప్‌ అడ్మినిస్ట్రేటర్‌దే పూర్తి బాధ్యత హద్దు దాటితే శిక్ష తప్పదు

 
సిటీబ్యూరో: మహారాష్ట్రలోని మరాట్వాడ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం ఏమిటో తెలుసా? ‘అడ్మిన్’గా ఉండటమే. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన ఓ సందేశం ప్రచారమైంది.గ్రూప్ సభ్యురాలిగా ఉన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు గ్రూప్ అడ్మిన్‌నూ కటకటాల్లోకి పంపారు. వాట్సాప్ గ్రూప్‌లు ‘క్రియేట్’ చేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన చెబుతోంది.

 విస్తరిస్తున్న వాట్సాప్...
 వాట్సాప్... సోషల్ మీడియాలో ఓ ప్రభంజనం. నెట్ సౌకర్యం ఉన్న ప్రతి ఫోన్‌లోనూ ఇదీ ఉంటోంది. కేవలం సంక్షిప్త సందేశాలు మాత్రమే కాకుండా నిర్ణీత పరిమాణంలో ఉన్న వాయిస్, వీడియో ఫైల్స్‌తో పాటు ఫొటోలను మార్పిడి చేసుకునే అవకాశం ఈ యాప్‌లో ఉంది. దీంతో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఇటీవల కాలంలో గ్రూపులూ పెరుగుతున్నాయి. ఒక సందేశాన్నో, ఫొటో/వీడియోనో ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి ఈ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు.
 
వ్యక్తిగతం నుంచి  అధికారికం వరకు...

 స్నేహితులు.. ఓ ప్రాంతానికి చెందిన వారు... ఒకే రకమైన ఆలోచనా ధోరణి కలిగిన వారు... ఇలా ఎవరికి వారు వ్యక్తిగతమైన వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఈ కారణాలతో పాటు ఇటీవల కాలంలో వాట్సాప్ వెబ్ అందుబాటులోకి వచ్చాక గ్రూపుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.
 
గ్రూపులు ఇలా...
 వాట్సాప్‌లో ఓ గ్రూపును ఏర్పాటు చేయడం ఒకరి చేతిలోనే ఉంటుంది. గ్రూప్ క్రియేట్ చేయాలని భావించిన వ్యక్తి తన హ్యాండ్‌సెట్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేటర్ (అడ్మిన్)గా వ్యవహరిస్తాడు. ఈ అవకాశాన్ని గ్రూపులో ఉండే మరికొందరికీ ఇచ్చే సౌలభ్యం ప్రధాన అడ్మిన్‌కు ఉంటుంది. ఆ గ్రూపులో ఎవరిని చేర్చుకోవాలి? అనేది అడ్మిన్ల చేతిలో ఉంటుంది. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన పేర్లలోని ఎవరినైనా గ్రూపులో చేర్చుకోవచ్చు, తొలగించవచ్చు.
 
సభ్యులందరికీ  షేరింగ్ సౌలభ్యం...
 ఓ గ్రూపులో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ గ్రూప్‌లో సందేశం, ఫొటో, వీడియో, ఆడియోను షేర్ చేసే సౌలభ్యం ఉంటుంది. దీనికి అడ్మిన్ అనుమతి, వారి ప్రమేయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే చాటింగ్స్, పోస్టింగ్స్, షేరింగ్ అడ్మిన్‌కు తెలియకుండానే జరిగిపోతుంటాయి. వాటిని గ్రూప్‌లో చూసుకునే వరకు అడ్మిన్‌కు కూడా తెలిసే అవకాశం లేదు.
 
 
 అది నేరమే

 అడ్మిన్ అనుమతి... ప్రమేయం లేకుండా గ్రూపులోని సభ్యులు అభ్యంతరకర, అశ్లీల పోస్టింగ్, షేరింగ్ చేసినా అడ్మినిస్ట్రేటర్‌దే పూర్తి బాధ్యత. ఆ గ్రూపునకే చెందిన లేదా వేరే వ్యక్తులెవరైనా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే కటకటాల్లోకి చేరాల్సిందేనని మర్చిపోకూడదు. ఈ చర్యలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ కింద నేరాలే అవుతాయి.
 
నిబంధనలు తెలుసా...?
వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పుడే డిస్‌క్లైమర్‌ను అంగీకరిస్తాం. అందులోని నిబంధనల ప్రకారం వాట్సాప్ సభ్యుడు, అడ్మిన్ కొన్ని రకాలసందేశాలు, ఫొటోలు, వీడియోలు హోస్ట్ చేయడం, పోస్ట్ చేయడం, డిస్‌ప్లేలు... మార్పు చేర్పులు... అప్‌డేట్ చేయడం... షేర్ చేయడం నిషేధం. అవి ఏంటంటే...

 1.    అధికారికంగా మరో వ్యక్తికి చెందినవి.
 2.     ఇతరులకు ఇబ్బంది కలిగించే, అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన అభ్యంతరకమైనవి.
 3.     ఓ మతం, వర్గం, వర్ణం, కులం, జాతులను కించపరిచేవి.
 4.     రెండు వర్గాల మధ్య వైరుధ్యాలు రెచ్చగొట్టేవి.
 5.     మైనర్లకు హానికరమైనవిగా పరిగణించేవి.
 6.     శాంతిభ్రదతలు, ప్రజా జీవితానికి భంగం కలిగించేవి.
 7.     దేశ, జాతి, రాష్ట్ర సమగ్రతకు ముప్పుగా మారే పుకార్లు
 8.     కేసుల దర్యాప్తునకు ఆటంకంగా మారేవి.
 9.     వ్యక్తులు, గ్రూపులను టార్గెట్‌గా చేసుకుని బెదిరింపులు, హెచ్చరికలు.
 
 
ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తాం

వాట్సాప్ గ్రూప్‌లో సర్క్యు లేట్ అవుతున్న అభ్యంతరకర, అశ్లీల, చట్ట వ్యతిరేక కంటెంట్ పై ప్రాథమిక సాక్ష్యాధారాలతో ఎవరు ఫిర్యాదు చేసినా ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం. ఆ గ్రూప్‌లో దాన్ని షేర్ చేసిన వ్యక్తితో పాటు దాని అడ్మిన్ సైతం నిందితుడే అవుతాడు. ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంటుంది.      
 - పి.రాజు,
 సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్, సీసీఎస్
 
 ప్రధాన అడ్మిన్‌దే పూర్తి బాధ్యత
 ఓ గ్రూప్‌లో సర్క్యులేట్ అయిన అభ్యంతరకర, అశ్లీల కంటెట్‌కు దాని అడ్మినే బాధ్యుడు. గ్రూపులో ఉన్న సభ్యుడిని నొప్పించేలా పోస్టింగ్స్ ఉన్నా అంతే. ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదవుతాయి. ఎంత మంది అడ్మిన్లు ఉన్నా... గ్రూప్ క్రియేట్ చేసిన ప్రధాన అడ్మిన్‌దే పూర్తి బాధ్యత. మిగిలిన వారికీ కొంతమేర బాధ్యత ఉంటుంది.    
 - రామ్మోహన్ వేదాంతం
 ఐటీ యాక్ట్ న్యాయవాది, సైబర్ నిపుణుడు
 
 ఫేస్‌బుక్ తరహాలో ఉంటే మేలు
 మన ప్రమేయం లేకుండానే స్నేహితులు, ఇతరులు తమ వాట్సాప్ గ్రూప్‌లలోకి చేర్చుకోవడం అభ్యంతరకరం. గ్రూప్‌లలో పోస్టయ్యే సమాచారం, వీడియోలు, మెసేజ్‌లు, జోక్‌లు, కామెంట్స్ కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వీటికి గ్రూప్‌ను నిర్వహించే అడ్మిన్ బాధ్యత వహించాలనే విషయం చాలామందికి తెలియదు . కొన్నిసార్లు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఫేస్‌బుక్‌లా రిక్వెస్ట్ పంపడం... ఆమోదించడం తరహాలో వాట్సాప్ యాజమాన్యం కూడా స్పందించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా నియమ నిబంధనలు రూపొందించాలి.    
 - అల్లిపురం రాజశేఖర్‌రెడ్డి, ఎమ్‌డీ, పైసా వసూల్ డాట్‌కామ్
 
 అనుమతి అవసరం

 వాట్సాప్ గ్రూప్‌లతో లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ఒక మెసేజ్‌ను పలువురు
 స్నేహితులకు పంపించడం ఇబ్బందిగా ఉంటుంది. నెట్ నూ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఒక గ్రూప్‌లో అయితే క్షణాల్లో అందరికీ సమాచారం పంపవచ్చు . ఇక మనకు తెలియకుండానే గ్రూప్‌లో చేర్చుకోవడం, అసభ్య మెసేజ్‌లు చూడాల్సిరావడం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం గ్రూప్ నుంచి ‘లెఫ్ట్’ అయితే ఆ జాబితాలో మన నెంబర్ ఉంటుంది. వాట్సాప్ యాజమాన్యం దీనిపై దృష్టి పెట్టి గ్రూప్‌లో చేర్చుకునేటప్పుడు మన అనుమతి ఉండేలా మార్పులు చేస్తేమంచిది.
 -గిరీష్మ, విద్యార్థిని, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్
 
 

మరిన్ని వార్తలు