బంజారాహిల్స్ పీఎస్‌లో ఐఎఫ్‌ఎస్ అధికారి ఫిర్యాదు

18 Sep, 2016 19:06 IST|Sakshi

తన భార్యను కారుతో ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు తనపై దుర్భాషలాడిన జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఐఎఫ్‌ఎస్ అధికారి చందన్‌మిత్రా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెట్రోల్‌బంక్ యజమానిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ సీసీఎఫ్ చందన్‌మిత్రా శనివారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో తన భార్య నందితా మిత్రాతో కలిసి బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు వాకింగ్ వచ్చారు. భార్యను రోడ్డుపై దింపి కారును పార్కింగ్ చేసేందుకు చందన్‌మిత్రా వెళ్లారు. అదే సమయంలో క్యాన్సర్ ఆస్పత్రి వైపు నుంచి ఏపీ 09 బీజీ 446 నంబర్ కారు మితిమీరిన వేగంతో వచ్చి రోడ్డు పక్కన నిలబడ్డ నందితామిత్రాను ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదేమిటని ఆమె ప్రశ్నిస్తుండగానే నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తూ సదరు వ్యక్తి పార్కులోకి వాకింగ్‌కు వెళ్లాడు. జరిగిన విషయాన్ని నందిత తన భర్త చందన్‌మిత్రాకు తెలిపింది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా కనిపించిన సునీల్‌ను అంత నిర్లక్ష్యం ఏంటని కనీస మర్యాద లేదా అంటూ చందన్‌మిత్రా ప్రశ్నించగా ఆయనపై కూడా దురుసుగా ప్రవర్తించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అసభ్య పదజాలంతో దూషించాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఐఎఫ్‌ఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు