మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపు

3 Aug, 2017 11:30 IST|Sakshi
మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపు

హైదరాబాద్‌ : మెట్రో రైల్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో అమీర్‌పేటలోని మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్ళింపులు విధించారు. ఇవి గురువారం నుంచి 45 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరించాలని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం కోరారు.

►ఎర్రగడ్డ, అమీర్‌పేట వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్ళే వాహనాలను ఎస్సార్‌నగర్‌లోని ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి ఎస్సార్‌నగర్‌ ఠాణా, ఎస్సార్‌నగర్‌ టి జంక్షన్, సత్యం థియేటర్, దుర్గామాత టెంపుల్‌ మీదుగా పంపిస్తారు. ఈ మార్గం వన్‌వేగా ఉండే నేపథ్యంలో దీనికి వ్యతిరేక దిశలో వాహనాలు అనుమతించరు.
►ఫతేనగర్‌ నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను సత్యం థియేటర్‌ వైపు అనుమతించరు. వీటిని బల్కంపేట ఆర్‌ అండ్‌ బీ ఆఫీస్, డీకే రోడ్, జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్‌ మీదుగా పంపిస్తారు.
►ఎర్రగడ్డ వైపు నుంచి మధురానగర్, కళ్యాణ్‌నగర్‌ వైపు వెళ్ళే తేలికపాటి వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఉమేష్‌ చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి కుడి వైపునకు భారీ వాహనాలను ఎడమ వైపునకు మళ్లిస్తారు.
►జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్, అమీర్‌పేట–సోనాబాయ్‌ టెంపుల్‌ మధ్య ఇరుకైన రోడ్డు కావడంతో దీన్ని వన్‌వేగా చేస్తున్నారు. సోనాబాయ్‌ టెంపుల్‌ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.
►బేగంపేట నుంచి ఎస్సార్‌గనర్, యూసుఫ్‌గూడ వైపు వెళ్ళే వాహనాలను సత్యం థియేటర్‌ వైపు అనుమతించరు. వీటిని దుర్గామాత దేవాలయం నుంచి మైత్రివనం వైపు మళ్ళిస్తారు.
►ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా, ఎస్సార్‌నగర్‌ టి జంక్షన్‌ మధ్య ఉన్న బై లైన్‌ రోడ్స్‌లో కమ్యూనిటీ హాల్‌ రోడ్‌ మినహా మిగిలినవి మూసేస్తారు.
►అమీర్‌పేట జంక్షన్‌ నుంచి మైత్రివనం, ఎస్సార్‌నగర్‌ వైపు వెళ్ళే వాహనాలు యథావిధిగా ప్రయాణిస్తాయి.  
►ట్రాఫిక్‌ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తగిన రూట్లు ఎంపిక చేసుకుంటే మంచిది.

మరిన్ని వార్తలు