సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్యాయత్నం

19 Nov, 2016 02:57 IST|Sakshi
సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్యాయత్నం

►  గైడ్ వేధింపుల కారణంగానే అంటున్న విద్యార్థులు!
► ల్యాబ్‌లో చేతి మణికట్టు వద్ద కోసుకున్న మోజెస్ అబ్రహం
► వెంటనే ఆస్పత్రికి తరలించిన విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది
► పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యుల వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం అనంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో.. మోజెస్ అబ్రహం అనే మరో దళిత పరిశోధక విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన ఆయన... వర్సిటీలో ఏసీఆర్‌ఈహెచ్‌ఎం విభాగంలో పీహెచ్‌డీ రెండో సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ల్యాబ్‌లో చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆశా ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అబ్రహం పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వివక్ష చూపడం వల్లే..?: అబ్రహం ఆత్మహత్యాయత్నానికి ఆయన గైడ్ వేధింపులే కారణమని వర్సిటీలోని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన విద్యార్థులు ఆరోపించారు. అబ్రహం తాను చేపట్టిన అంశానికి సంబంధించి రెండు పరిశోధన పత్రాలు సమర్పించారని, అవి రెండు ప్రముఖ జర్నల్స్‌లో అచ్చు అయ్యాయని వారు తెలిపారు. అరుునప్పటికీ పరిశోధన అంశాన్ని మార్చుకోవాలంటూ అబ్రహంను గైడ్ వేధించారని పేర్కొన్నారు. ఇటీవల అబ్రహం పరిశోధిస్తున్న అంశంపై జరిగిన సెమినార్‌కు హాజరుకానీయకుండా ఆయనను అడ్డుకుని, వివక్ష చూపడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. ఇదే పరిశోధన విభాగంలో 2004లో పరిశోధక విద్యార్థి మాదారి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల వివక్ష కారణంగానే ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు