నగరంలో విషాదఛాయలు

13 Sep, 2015 00:04 IST|Sakshi
నగరంలో విషాదఛాయలు

దురంతో ప్రమాదంలో ఇద్దరు నగరవాసుల మృతి
9 మందికి గాయాలు పలు రైళ్ల రద్దు, మళ్లింపు

 
,మియాపూర్:  గుల్బర్గా వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరు మియాపూర్ జనప్రియ అపార్ట్‌మెంట్ చెందిన  జ్యోతి(46), కాగా, పుష్పలత అనే మహిళ మృతి చెందింది.  ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇదే ఘటనలో నగరానికి చెందిన  ఎం.లక్ష్మి, అబ్దుల్ ఆష్రాఫ్, రాజీవ్‌రంజన్‌రాయ్, జీవి రామకృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బి.భాస్కర్‌రావు, బి.మాణిక్యరెడ్డి, బి.యాదమ్మ,వై.శ్రీకాంత్, సుష్మ పోద్దార్ లకు స్వల్ప గాయాలయ్యాయి.

 టూర్‌కు వెళుతూ...
 దూలపల్లిలోని రాజ్‌దీప్ గ్రూప్ సంస్థలో స్టార్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న జ్యోతి భర్త శంకర్, ఇద్దరు కుమారులతో  మియాపూర్ జనప్రియ ఫోర్త్ ఫేస్‌లో 207 బి బ్లాక్‌లో నివాసం ఉంటోంది.అరుుతే రాజ్‌దీప్ గ్రూప్ సంస్ధ  ఏటా ఉద్యోగులను కంపెనీ నుంచి టూర్‌కు పంపిస్తుంది. ఎప్పటిలానే 22 మందిని ఎంపిక చేసి పూనే పంపించింది. హైదరాబాద్ నుండి ముంబాయ్ వెళ్లే దురంతొ ఎక్స్‌ప్రెస్‌లో జ్యోతితో పాటు మరో 21 మంది శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లారు గుల్‌బర్గా సమీపంలో వారు ప్రయాణిస్తున్న రైలు ప్రమదానికి గురికావడంతో ఆమె మృతి చెందింది. శనివారం రాత్రి ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.

పలు రైళ్లు రద్దు
 దురంతో ఎక్స్‌ప్రెస్ (12220) ప్రమాదం నేపథ్యంలో  శనివారం నగరం నుంచి బయలుదేరవలసిన పలు రైళ్లు రద్దుకాగా మరికొన్నింటిని దారిమళ్లించారు. శనివారం  హైదరాబాద్ నుంచి బయలుదేరే హైదరాబాద్-గుల్బర్గా ప్యాసింజర్ రద్దయింది. సికింద్రాబాద్-పూనే శతాబ్ది ఎక్స్  గుల్బర్గా వరకే పరిమితం చేశారు. ఫలక్‌నుమా-షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ చిత్తాపూర్ వద్ద నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి హుబ్లీ వెళ్లే రైలును వాడి,గుంతకల్ మీదుగా దారిమళ్లించారు. ఫలక్‌నుమా-గుల్బర్గ ప్యాసింజర్ చిత్తాపూర్ వరకు పరిమితమైంది. బీజాపూర్-బొల్లాపూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలును  చిత్తాపూర్-బొల్లారం మధ్య నడిపారు. భువనేశ్వర్-ముంబయిసీఎస్‌టీ కోణార్క్‌ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-కుర్లా ఎల్‌టీటీ,హైదరాబాద్-ముంబయి హెస్సేన్‌సాగర్, కాకినాడ-కుర్లా ఎక్స్‌ప్రెస్ రైళ్లను   సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, లాతూర్ మీదుగా మళ్లించారు.హుబ్లీ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్,వాడి మీదుగా మళ్లించారు. రైళ్ల రద్దుతో హైదరాబాద్,సికింద్రాబాద్ స్టేషన్‌లలో  ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు.
 

మరిన్ని వార్తలు