పులిరాజా కబళిస్తోంది!

27 Jul, 2017 03:30 IST|Sakshi
పులిరాజా కబళిస్తోంది!
రాష్ట్రంలో పెరుగుతున్న హెచ్‌ఐవీ బాధితులు
 
ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తున్న ‘హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్‌ (హెచ్‌ఐవీ)’ భూతం చాప కింద నీరులా మెల్లమెల్లగా కబళిస్తోంది. దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది దీని బారిన పడుతుండగా.. మన రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 12 వేల మందికిపైగా హెచ్‌ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఇక హెచ్‌ఐవీ ముదిరిపోయి ‘ఎయిడ్స్‌ (అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌)’ దశకు చేరిన వేలాది మంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు.
–సాక్షి, హైదరాబాద్‌ 

ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవీ బాధితులు 36.70 కోట్లు
భారత దేశంలో హెచ్‌ఐవీ బాధితులు 21.17లక్షలు
తెలంగాణలో హెచ్‌ఐవీ బాధితులు 2.01లక్షలు
చికిత్స పొందుతున్న వారు 69,901 
చికిత్స పొందుతున్న వారిలో పిల్లలు 2,804
ప్రత్యేక బ్లడ్‌ బ్యాంకులు 134
హెచ్‌ఐవీకి కారణమయ్యే హైరిస్క్‌ గ్రూపు 1,87,864
సెక్స్‌ వర్కర్లు,ట్రాన్స్‌ జెండర్లు 66,588
సమగ్ర అవగాహన, చికిత్స కేంద్రాలు 852
పరీక్షలు,మందుల పంపిణీ కేంద్రాలు 101
 
చాప కింద నీరులా... 
హెచ్‌ఐవీ సోకిన వారిలో చాలా మందికి తగిన చికిత్స అందడం లేదు. తమకు హెచ్‌ఐవీ ఉన్నట్లు బయటికి తెలిస్తే వెలివేతకు గురవుతామన్న ఆందోళన, హెచ్‌ఐవీ మందులు అత్యంత ఖరీదు కావడం, పేదరికం, హెచ్‌ఐవీ సోకినా కొంతకాలం వరకూ గుర్తించకపోవడం వంటి కారణాలతో.. చికిత్స చేసుకునే రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో వారి ద్వారా హెచ్‌ఐవీ మరింత మందికి సోకుతోంది. పదేళ్ల కిందటితో పోల్చితే హెచ్‌ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గినా... ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉండడం ఆందోళనకరం. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌లను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 
 
చికిత్స అందుతున్నది కొందరికే..
తెలంగాణలో 2,01,167 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్లు అంచనా. కానీ అందులో 69,901 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. దీనికితోడు ఏటా కొత్తగా 12 వేల మంది వరకు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా కేంద్రాల్లో హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స కేంద్రాలు ఉన్నాయి. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్‌ రోగులకు ప్రతి నెల రూ.వెయ్యి పింఛనుగా అందిస్తోంది.
 
ఎంతగా ప్రయత్నిస్తున్నా..
హెచ్‌ఐవీ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టాయి. ఇందుకోసం భారీగా నిధులు కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ (ఏసీఎస్‌)లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (న్యాకో) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. ప్రజల్లో హెచ్‌ఐవీపై అవగాహన కల్పన, మందుల పంపిణీ, చికిత్స అందిస్తున్నాయి. హెచ్‌ఐవీ వ్యాప్తికి కారణమయ్యే సెక్స్‌ వర్కర్లు, ట్రాన్స్‌ జెండర్లు, స్వలింగ సంపర్కుల వివరాలను నమోదు చేస్తున్నాయి.
 
ప్రతి రక్త నమూనా పరిశీలన
హెచ్‌ఐవీ వ్యాప్తిలో రక్త మార్పిడి ప్రక్రియ కూడా కీలకంగా మారింది. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల రక్తం, బ్లడ్‌ బ్యాంకులకు చేరుతున్న రక్తం వంటివాటిని ఎవరికైనా ఎక్కించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పరీక్షించక పోతుండ డంతో హెచ్‌ఐవీ సంక్రమిస్తోంది. దీంతో ఇటీవల ప్రతి రక్త నమూనానూ తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్ష చేసేలా చర్యలు చేపట్టారు. ఇలా ఏటా సగటున 20 లక్షల రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.
 
తెలంగాణలో హెచ్‌ఐవీ పరిస్థితి.. (2016–17లో)
నిర్ధారణ కోసం మొత్తం రక్త పరీక్షలు 19,32,987
ఏసీఎస్‌ ఆధ్వర్యంలో సేకరించిన నమూనాలు 6,74,324
అవసరార్థం ఇచ్చిన రక్త నమూనాలు 4,05,527
రక్తదానం చేసిన వారి నమూనాలు  2,68,797
హెచ్‌ఐవీగా నిర్ధారించినవి 11,403
గర్భిణుల రక్త నమూనాలు 6,71,925
హెచ్‌ఐవీగా నిర్ధారణ అయినవి 655
పంపిణీ చేసిన కండోమ్‌లు 38,70,276
మరిన్ని వార్తలు