యువతికి మత్తు మందు ఇచ్చి.. డాక్టర్ అసభ్య ప్రవర్తన

6 Oct, 2015 00:45 IST|Sakshi
యువతికి మత్తు మందు ఇచ్చి.. డాక్టర్ అసభ్య ప్రవర్తన

కంటోన్మెంట్: ఆసుపత్రికి వచ్చిన ఓ యువతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి తరఫు బంధువులు వెల్లడించిన వివరాల మేరకు లాల్‌బజార్‌లో ఉండే ఓ యువతి (20) సోమవారం సాయంత్రం చర్మ వ్యాధికి సంబంధించి  స్థానికంగా ఉండే గీత నర్సింగ్ హోంకు వెళ్లింది. అక్కడ ఉండే డాక్టర్ ఇంజక్షన్ ఇస్తానని చెప్పి బెడ్‌పై పడుకోబెట్టాడు. ఆమె చేతికి ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే మత్తులోకి జారుకుంది. తన కళ్లముందు జరుగుతున్న సంఘటనలు గుర్తిస్తున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సత్తువలో అచేతనంగా ఉండిపోయింది.

కొద్దిగా శక్తిని కూడదీసుకున్నాక తన మిత్రుడికి ఫోన్ చేయడంతో అతను హుటాహుటిని ఆసుపత్రికి చేరుకున్నాడు. అతను వెళ్లేసరికి కుర్చీలో ఆ యువతి కుర్చీలో నీరసంగా పడిపోయి ఉంది. ఆమె సెల్‌ఫోన్ కిందపడిపోయి ఉంది. ఈ సందర్భంగా ఆమె తన మిత్రుడికి జరిగిన ఘటనను వివరించింది. అయితే అమ్మాయి నీరసంగా ఉండటంతో ఇంజక్షన్ ఇవ్వగా నిస్సత్తువలోకి జారుకుందని డాక్టర్ బుకాయించాడు. అయితే తనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాక శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతి తన మిత్రుడికి తెలిపింది. వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
 
 

మరిన్ని వార్తలు