హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాహనాన్ని అడ్డుకున్న గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావుపై వేటు పడింది. ఆయన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 9న మహంకాళి అమ్మవారి దర్శనానికి దత్తాత్రేయ కుటుంబసమేతంగా వచ్చారు.
అయితే దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఏసీపీ శ్రీనివాసరావు ఆలయానికి కొద్దిదూరం ముందే నిలిపివేశారు. తన సతీమణి అనారోగ్యం కారణంగా నడవలేదని దత్తాత్రేయ చెప్పినా ఆయన వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక కేంద్రమంత్రి వాహనం దిగి నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో హైదరాబాద్ పోలీసు కమిషన్ మహేందర్రెడ్డి విచారణకు ఆదేశించారు.