కృష్ణా జలాలపై బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌లో విచారణ

23 Feb, 2018 01:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. ఏపీ తరఫు సాక్షి అయిన వ్యవసాయ రంగ నిపుణుడు పీవీ సత్యనారాయణకు తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది రవీందర్‌రావు పలు ప్రశ్నలు సంధించారు. ఉమ్మడి ఏపీలో వాతావరణం ఆధారంగా ఏర్పాటు చేసిన అగ్రో క్లైమేట్‌ జోన్లపై పలు ప్రశ్నలు వేశారు.

గోదావరి జోన్‌లో ఏడీఆర్‌గా ఉన్న తాను తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త వంగడాల తయారీకి సాయం చేశానని, ఎంటీయూ 1061, ఎంటీయూ 1075 తదితర వరి వంగడాలను తెలంగాణ కోసం తయారు చేసినట్లు సత్యనారాయణ చెప్పారు. జాతీయ వ్యవసాయ పరిశోధన ప్రాజెక్టు సిఫార్సుల మేరకు వ్యవసాయ వాతావరణ జోన్లు ఏర్పాటు చేస్తారని, ఉమ్మడి ఏపీలో మొత్తం 9 ఉన్నట్లు సమాధానాలిచ్చారు. విచారణ శుక్రవారం కూడా కొనసాగనుంది.

మరిన్ని వార్తలు