ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది

28 Aug, 2016 04:34 IST|Sakshi
ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది

జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందన్న విషయాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలుసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అలాకాకుండా ప్రజల గొంతును నొక్కేస్తాను, భయపెడతానంటే కుదరదన్నారు. తాను 16వ ఏట నుంచే ఉద్యమాల్లో ఉన్నానని.. 1969 నుంచే రైతు, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నానని.. ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తాను ఉద్యమంలో పాల్గొన లేదంటే ఆ సమయంలో ఎక్కడ ఉన్నాను, ఏం జడ్జిమెంట్ ఇచ్చాను అనే విషయాలు తెలుసుకోవాలని అన్నారు.

తన తండ్రి రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేశారని.. అలాంటి కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. జర్నలిస్టుగా, రచయితగా పనిచేసిన వ్యక్తి ఎంతో సమున్నతంగా, విశాలంగా ఆలోచించాలని అందుకు భిన్నంగా తప్పును ప్రశ్నించే వారిని భయపెట్టిస్తామనడం సబబు కాదన్నారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు మన్నారం నాగరాజు, సోగెరా బేగం, రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి రాంనర్సయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు సాంబశివ గౌడ్‌లు మాట్లాడుతూ.. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా రెండున్నరేళ్లుగా ఉంటూ జర్నలిస్టుల సమస్యలు ఒక్కటైనా పరిష్కరించకపోగా.. అవి ప్రస్తావించిన వారిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ అల్లం నారాయణ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. ఒక ఉన్నతమైన, మచ్చలేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

మరిన్ని వార్తలు