ఆయన విమర్శల్లో పసలేదు: కవిత

3 Apr, 2016 19:12 IST|Sakshi

హైదరాబాద్ : అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగునీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన విరమ్శల్లో పస లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బావుందని దేశమంతా కితాబు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు వాస్తవాలు విస్మరించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.  ఆదివారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను విజన్ ఉన్న నాయకుడిగా అంతా కొనియాడుతుంటే, భట్టి చేసిన విమర్శలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.   

భట్టి మాటల్లో నిజం ఉంటే అసెంబ్లీకి హాజరయ్యేవారని, ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాకే పలాయనం చిత్తగించారని పేర్కొన్నారు. గడిచిన అరవై ఏళ్ల అన్యాయాలను సీఎం కేసీఆర్ ఎండగడతారనే భయంతోనే అసెంబ్లీకి డుమ్మా కొట్టారని తెలిపారు. భట్టివిక్రమార్క చెప్పే మాట్లా వాస్తవం ఉంటే రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో అధ్యయనం చేసి సీఎం దృష్టికి తీసుకు వెళతామన్నారు. పాలక, ప్రతిపక్షాలు కలిసి చేసే నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని కవిత వివరించారు.

ఏ విషయాన్నైనా చర్చించడానికి అసెంబ్లీకి మించిన వేదిక ఏముంటుందన్నారు. తన ప్రజెంటేషన్‌కు ముందు అన్ని పార్టీల సభ్యులను మాట్లాడాలని , అన్ని విషయాలను చర్చించాలని కోరిన విషయాన్ని సీఎంను విమర్శించే ప్రతిక్షాలు గుర్తు చేసుకోవాలని ఎంపీ కవిత హితవు పలికారు.

>
మరిన్ని వార్తలు