4 పెద్దాసుపత్రులు

21 Feb, 2016 02:14 IST|Sakshi
4 పెద్దాసుపత్రులు

నగరంలో వెయ్యి పడకల హాస్పిటళ్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశం
గ్రామీణ ప్రాంత ప్రభుత్వ వైద్యులు పనిచేసేచోటే ఉండక్కర్లేదు
సమీపంలోని పట్టణంలో నివాసానికి అవకాశం కల్పిస్తాం
అదనపు వేతనం కూడా అందజేస్తాం
పల్లెల్లో పనిచేయాలనే నిబంధన కచ్చితంగా అమలు
ప్రతి జిల్లాలో నాలుగు చోట్ల ఎంఆర్‌ఐ, సీటీస్కాన్ యంత్రాలు
నిర్లక్ష్య ధోరణిని వీడాలని అధికారులకు ఆదేశం
రూ. 8,400 కోట్ల బడ్జెట్ కోరిన వైద్యారోగ్యశాఖ


సాక్షి, హైదరాబాద్: నగరంలో గాంధీ, ఉస్మానియాలకు తోడుగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. వారు పనిచేస్తున్న చోటేగాకుండా సమీప పట్టణాల్లో నివసించేందుకు  అనుమతించనుంది. దీంతోపాటు వారికి అదనపు వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే వీటిని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సంఖ్య పెంచి, ప్రతి వైద్యుడు ఎన్ని గంటలు విధుల్లో ఉండాలో నిర్ణయించాలని సూచించారు. వైద్య విద్యార్థులే కాకుండా, ప్రభుత్వ వైద్యులంతా కచ్చితంగా కొంతకాలం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనే నిబంధనను  అమలు చేయాలని ఆదేశించారు. బడ్జెట్ సమీక్షల్లో భాగంగా శనివారం వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్షించారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు రాజేశ్వర్ తివారీ, రామకృష్ణారావు, శివశంకర్, సమాచార కమిషనర్ నవీన్‌మిట్టల్ ఇందులో పాల్గొన్నారు.
 

 రాజధానిలో నాలుగు పెద్దాసుపత్రులు
 

 హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియాలకు తోడుగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించాలని... అందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కింగ్‌కోఠి ఆసుపత్రి స్థాయిని పెంచి మల్టీ స్పెషాలిటీగా మారుస్తామని చెప్పారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. వరంగల్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని... ఈ వర్సిటీ, మెడికల్ కాాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రస్తుతమున్న సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మిస్తామని సీఎం వెల్లడించారు. ప్రతి జిల్లాలో కనీసం నాలుగు చోట్ల, మొత్తం 40 చోట్ల ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, అల్ట్రా సౌండ్, మెమోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కిడ్నీ, కాలేయం లాంటి అవయవాల మార్పిడికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపర్చాలని సూచించారు.
 

 బెడ్‌లపై దుప్పట్లు మార్చడమూ కష్టమేనా..?
 

 ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని, నిర్లక్ష్య ధోరణిని వీడాలని అధికారులతో సీఎం పేర్కొన్నారు. ‘‘మీకు విపరీతమైన నిర్లక్ష్యం. ఉస్మానియా, గాంధీల్లో రోజూ దుప్పట్లు మార్చడం కూడా కష్టమేనా..? గవర్నర్ వెళ్లి చూస్తే గానీ మీకు జ్ఞానోదయం కాదా.. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నట్లే మంచి బెడ్లు, బెడ్‌షీట్లు, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. బెడ్‌షీట్లను ఎప్పటికప్పుడు మార్చాలి. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలి. గర్భిణుల ప్రసవ సమయంలో తమ కుటుంబీకులు కూడా వెంట ఉండేలా ప్రత్యేక గది అందుబాటులోకి తేవాలి. 108, 104 సేవలను మరింత బలోపేతం చేయడానికి అనువైన విధానం రూపొందించండి. జాతీయ రహదారుల మీద పెట్రోలింగ్ చేసే వాహనాలతో ఈ వాహనాలను అనుసంధానం చేయండి. ప్రమాదాలు సంభవించిన సమయంలో పోలీసు, ఆరోగ్యశాఖ సమన్వయంతో పనిచేయాలి..’’ అని సూచించారు.
 

 మళ్లీ ప్రతిపాదనలతో రండి
 

 వైద్యారోగ్య శాఖకు రూ.8,400 కోట్ల మొత్తాన్ని ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ప్రణాళిక కింద రూ.5,200 కోట్లు, మిగతా నిధులు ప్రణాళికేతర వ్యయం కింద కోరారు. అయితే ఈ మొత్తంతో ఏం చేస్తారని సీఎం ప్రశ్నించగా... అధికారులు మూస సమాధానాలు ఇవ్వడంతో మండిపడ్డారు. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రజలకు నమ్మకం కలగడం లేదని, ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిపాదనలతో మళ్లీ రావాలని ఆదేశించారు. కాగా బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ శనివారం క్యాంపు కార్యాలయంలో 10 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖతో పాటు పురపాలన, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఐటీ శాఖల ప్రతిపాదనలపై అధికారులతో కలసి కసరత్తు చేశారు.

మరిన్ని వార్తలు