- కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్కు మంత్రి హరీశ్రావు ఫోన్
- ఏపీ అభ్యంతరాలు పట్టించుకోవద్దని సూచన
సాక్షి, హైదరాబాద్ : రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) పనులను కొనసాగించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ను కోరారు. ఈ పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను పట్టించుకోవద్దని సూచించారు. ఈ మేరకు శుక్రవారం పాటిల్కు మంత్రి హరీశ్రావు ఫోన్ చేశారు. పనుల కొనసాగింపుపై ఏపీ మోకాలడ్డుతున్న తీరుపై ఇరువురూ చర్చించారు.
ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5-6 టీఎంసీలకు మించి నీరందడం లేదని, దీంతో 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా 20వేలకు మించి అందడం లేదని హరీశ్ మరోమారు కర్ణాటక దృష్టికి తెచ్చారు. తాము కొత్తగా ఏపీ వాటాల్లోంచి నీరు కోరడం లేదని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటినే కోరుతున్నామన్నారు. ఆ నీటికి ఏపీ అడ్డుపడుతోందని, కర్ణాటక పనులు మొదలుపెట్టగానే ఏపీ అధికారులు.. పనులు కొనసాగించవద్దని అంటూ, శాంతి భద్రతల సమస్యను తెరపైకి తెచ్చి బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ దృష్ట్యా ఏపీ అభ్యం తరాలు పట్టించుకోవద్దని, పనులు కొనసాగించాలని కోరారు. దీనిపై కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల్లో కాల్వల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. కాగా ఇదే విషయమై రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి సైతం కర్ణాటక జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రాకేశ్సింగ్తో మాట్లాడారు. రాష్ట్రాలమధ్య వివాదముంటే ఆయా ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయని.. అంతేకాని ఏపీకి చెందిన జిల్లా అధికారులు మరో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాయడమంటే కర్ణాటక వ్యవహారాల్లో అకారణంగా జోక్యం చేసుకోవడమేనని జోషి పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, మరో రాష్ర్టం అధికారాలను సవాలు చేయడమేనని రాకేశ్సింగ్కు జోషి వివరించారు. పనులను వేగంగా పూర్తి చేయడానికి కృషి చేయాలని కోరారు.
బంతి తుంగభద్ర బోర్డు పరిధిలోకి..
కాగా ఆర్డీఎస్ ఆధునికీకరణ పనుల అంశం తుంగభద్ర బోర్డుకి చేరింది. ఏపీ అధికారులు పనులను అడ్డుకుంటున్నారంటూ తెలంగాణ చేసిన ఫిర్యాదును కృష్ణా బోర్డు, తుంగభద్ర బోర్డుకు బదిలీ చేసింది. ఈ అంశాన్ని తేల్చాలని సూచించింది. దీనిపై త్వరలోనే తుంగభద్ర బోర్డు సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
24 గంటల్లో మాట నిలబెట్టుకున్న హరీశ్రావు
డిండి నిర్వాసితులకు రూ.17 కోట్లు పరిహారం మంజూరు
సాక్షి, హైదరాబాద్: డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద నిర్వాసితులను ఆదుకుంటామని మాట ఇచ్చిన 24 గంటల్లోనే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు దాన్ని నిలబెట్టుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భూనిర్వాసితులకు రూ.17కోట్లు పరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గురువారం మంత్రి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల పర్యటన సందర్భంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రిజర్వాయర్ ముంపు బాధితులు హరీశ్రావును కలసి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారిని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్ కింద ఇప్పటివరకు 523 ఎకరాల భూమి సేకరించగా, ఇప్పటికే రూ.10 కోట్లు చెల్లించారు. మరో రూ.17 కోట్లు చెల్లిస్తామని చెప్పిన మంత్రి శుక్రవారం నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై ముంపు గ్రామమైన మన్నవారిపల్లె గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.