⇒ తాగిన మైకంలో ఘాతుకం
⇒ ఎర్రగుంట శ్మశాన వాటికకు తీసుకెళ్లి హత్య
సైదాబాద్: రొట్టె కోసం జరిగిన వివా దం హత్యకు దారి తీసిన సంఘటన ఈనెల 17న సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎర్రగుంట శ్మశాన వాటికలో ఈనెల 17న జరిగిన ఓమెద్ అలీ హత్య కేసును చేధించిన సైదాబాద్ పోలీసులు అతని స్నేహితులే తాగిన మైకంలో హత్య చేశారని నిర్థారించారు. శుక్రవారం నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇన్స్పెక్టర్ కాట్న సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తలాబ్కట్టకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ మిస్కిన్, దిల్సుఖ్నగర్లోని చెప్పుల దుకాణంలో పనిచేసే శివకుమార్, తలాబ్కట్టకు చెందిన ఒమెద్ అలీ ముగ్గురూ స్నేహితులు. వీరు ఈ నెల 16 చంపాపేటలోని కల్లు కంపౌండ్లో కల్లు తాగారు. ఈ సందర్భంగా శివకుమార్ ఓమెద్ చపాతి లాక్కొని తినడంతో ఒమెద్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. దీంతో పక్కనే మిస్కన్ కల్పించుకుని వారిని తిట్టాడు.
దీంతో ఒమెద్ మిస్కిన్తో వాగ్వాదానికి దిగాడు. అతనంతరం ముగ్గురు సైదాబాద్ ఎర్రగుంట శ్మశాన వాటిక వద్దకు చేరుకోగా మిగతా ఇద్దరు కలిసి ఒమద్ను బండ రాయితో మోది హత్య చేశారు. ముందుగా గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు ఆటో డ్రైవర్ ఒమెద్ అలీగా గుర్తించి కూపీ లాగారు. హత్య జరిగిన రోజు అతను ఎక్కడెక్కడ తిరిగాడో విచారించగా కల్లు కంపౌండ్లో జరిగిన గొడవ వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.