కేంద్ర మాజీ మంత్రి పీఏ అరెస్ట్

3 Mar, 2017 19:45 IST|Sakshi

హైదరాబాద్‌: విశాఖ షిప్పింగ్‌ పోర్టులో సభ్యునిగా చేర్పిస్తాని నమ్మించి మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పీఏను అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సర్క్యూట్‌ హౌస్ ప్రాంతానికి చెందిన తమ్మినేని సత్యనారాయణ(41) శ్రీనగర్‌ కాలనీ నివాసి. కిల్లి కృపారాణి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అతడిపై ఆరోపణలు రావడంతో సత్యనారాయణను బాధ్యతల నుంచి తొలగించారు. ఈ క్రమంలో వాసవి కాలనీ కొత్తపేట్‌లో నివాసం ఉండే వ్యాపార వేత్త జి.రమేష్‌ను విశాఖ పోర్టు సభ్యునిగా అవకాశం కల్పిస్తానని, రూ.60 లక్షలు ఇవ్వాలని అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ మేరకు 2015లో రమేష్‌ రూ.40 లక్షలు, 2016లో రూ.20 లక్షలు సత్యనారాయణకు ఇచ్చాడు. దీంతో విశాఖ పోర్టు సభ్యునిగా నియమించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేరిట ఫోర్జరీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను సృష్టించి రమేష్‌కు ఇచ్చాడు. అది తీసుకుని రమేష్‌ ఢిల్లీకి వెళ్లి విచారించగా ఆ లెటర్‌ నకిలీదని తేలింది. ఈ మోసంపై బాధితుడు రమేశ్‌ ఈనెల 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి నుంచి రూ.7.60 లక్షలు నగదు, హోండా సిటీ కారు, రెండు ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఐపీసీ 420, 419, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు