మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు

20 Jun, 2017 01:36 IST|Sakshi
మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు

చంద్రబాబుపై పార్థసారథి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. 2019లో అధికారంలోకి రాలేమన్న దుర్బుద్ధితో తన కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నేతలకు రాష్ట్ర ఆదాయ వనరులను అప్పజెప్పాలన్న కుతంత్రంతో చంద్రబాబు పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారం కన్నా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందామని చంద్రబాబు ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కారని చెప్పారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే చేసిన ఐదు సంతకాలకు వెన్నుపోట్లు పొడిచారన్నారు. బెల్టుషాపులను నిర్మూలిస్తానని రెండో సంతకం చేసిన చంద్రబాబు దాన్ని గాలికి వదిలేసి టీడీపీ కార్యకర్తలకు వాటిని అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు.

మరిన్ని వార్తలు