కృష్ణా బోర్డు నుంచి గుప్తా ఔట్

29 Jun, 2016 03:46 IST|Sakshi
కృష్ణా బోర్డు నుంచి గుప్తా ఔట్

తెలంగాణ విజ్ఞప్తి మేరకు తొలగించిన కేంద్రం
గోదావరి బోర్డు సభ్య కార్యదర్శికి అదనపు బాధ్యతలు
తెలంగాణ అభిప్రాయం కోరకుండానే ప్రాజెక్టుల
నియంత్రణపై మొండిగా వ్యవహరించిన గుప్తా

 
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్‌కే గుప్తాను తొలగిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక  నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో గుప్తా వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న సమీర్ ఛటర్జీని గుప్తా స్థానంలో నియమించింది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న గుప్తా.. కృష్ణా బోర్డు మొదట్నుంచీ సభ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతోపాటు తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణా జలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన ఎలాంటి అంశాల్లో అయినా గుప్తా తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఆదేశాలు వెలువడుతుంటాయి. నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలి నుంచీ గుప్తాపై తెలంగాణ గుర్రుగా ఉన్నా.. ఆయనపై నేరుగా కేంద్రానికి ఏనాడూ ఫిర్యాదు చేయలేదు.

అయితే ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో గుప్తా కొంత మొండిగా వ్యవహరించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని పలు వేదికలపై తెలంగాణ పదేపదే విన్నవిస్తున్నా.. వాటిని గుప్తా పట్టించుకోకుండా డ్రాప్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్‌పై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా కేంద్రానికి పంపడంపై బోర్డు సమావేశంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

అయినా పట్టించుకోని గుప్తా.. పదిహేను రోజుల్లో నియంత్రణ అంశంపై అభిప్రాయం చెప్పకుంటే ఆమోదం తెలిపినట్లుగా పరిగణిస్తామంటూ రాష్ట్రానికి లేఖలు రాశారు. ఈ లేఖలతో అగ్గిమీద గుగ్గిలమైన తెలంగాణ.. గుప్తా వ్యవహారాన్ని నేరుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసింది. పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డెరైక్షన్‌లో గుప్తా పనిచేస్తున్నారని, ఆయన వల్లే వివాదాలు జటిలం అవుతున్నాయని వివరించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్న కే ంద్ర జల వనరుల శాఖ గుప్తాను బోర్డు బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు