ప్రేమ పేరుతో న్యాయవాది మోసం

12 Apr, 2016 19:17 IST|Sakshi
సైదాబాద్ : ప్రేమ పేరుతో న్యాయవాది నమ్మించి మోసం చేయడంతో యువతి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ యువతి సైదాబాద్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ లక్డీకాపూల్‌లోని యాడ్ ఏజెన్సీలో మెనేజర్‌గా పని చేస్తోంది. అదే ఇంట్లో తన పెదనాన్న అయిన హైకోర్టు న్యాయవాది రాజిరెడ్డి వద్ద రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు న్యాయవాదిగా శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. గత మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మబలికాడు. తీరా పెళ్లి విషయం ఎత్తే సరికి ముఖం చాటేశాడు. 
 
గత పది రోజులుగా అతను అందుబాటులో లేకుండా వేరే యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్దపడ్డాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న సదరు యువతి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డి తనను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడని, అతడిని తనకు అందుబాటులో లేకుండా వాళ్ల కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తనను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు