మన పథకాలను పొరుగుకు విస్తరిద్దాం

4 Sep, 2017 04:36 IST|Sakshi
మన పథకాలను పొరుగుకు విస్తరిద్దాం

గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలసిన బీసీ సంఘం నేతలు
 సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిల్స్‌ లాంటి కార్యక్రమాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆ రాష్ట్రాల గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం ఆయనతో సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆర్‌.కృష్ణయ్య సూచించగా, గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గానికో గురుకులాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. దీంతో పేదలకు ఉచిత విద్య మరింత చేరువవుతుందని గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పేర్కొన్నట్లు బీసీ సంఘ ప్రతినిధులు తెలిపారు. గవర్నర్‌ను కలసిన వారిలో సంఘ ప్రతినిధులు ఆర్‌.అరుణ్, నందగోపాల్, మారేశ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు