ప్రేమ + స్నేహం= ది ఎండ్

27 Jul, 2016 19:02 IST|Sakshi
సిద్దార్థ్‌ రాసి ఇచ్చిన బాండ్‌ పేపర్‌తో బాధితులు

► వేషం ఇస్తానని మోసం
► సినిమా కంపెనీ మూసేసిన దర్శకుడు
► పోలీసులను ఆశ్రయించిన బాధితులు


బంజారాహిల్స్‌: తాను తీయబోయే సినిమాలో హీరో వేషం ఇస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి సినిమా కంపెనీ మూసేసిన దర్శకుడిపై బాధితులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌ జిల్లా బోదన్‌కు చెందిన రాజేంద్రనాయక్‌ అలియాస్‌ డీవీ సిద్దార్థ్‌ ఫిలింనగర్‌లోని అపోలో రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్‌ పేరుతో సినిమా కార్యాలయం తెరిచాడు. తాను దర్శకుడిగా జూన్‌ 19న ప్రేమ + స్నేహం= సంగీతం అనే సినిమాను నిర్మిస్తున్నాని, ఇందుకు హీరోలు కావాలని ప్రకటించాడు.

 

స్పందించిన రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ సమీపంలోని రాయిలాపురం గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌గౌడ్‌ తన అక్క పెళ్లి కోసం దాచిన రూ. 4 లక్షలు ఇంట్లోవారికి తెలియకుండా తెచ్చి హీరో వేషం కోసం ఇచ్చాడు. శ్రావణ్‌తో పాటు అదే ప్రాంతానికి రాజశేఖర్‌ రూ. 70 వేలు, కిషోర్‌ రూ. 30 వేలు... ఇలా చాలా మంది యువకులు వేషం కోసం డబ్బు చెల్లించారు. ఇందుకు గాను సదరు డైరెక్టర్‌ వారికి బాండ్‌ రాసిచ్చాడు. తీరా గత నెల 19న సినిమా ప్రారంభించాల్సి ఉండగా సిద్దార్థ్‌ మాయమాటలు చెప్పి దాటవేశాడు. వారం క్రితం సినిమా కార్యాలయం మూసేసి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. తాము మోసపోయానని గ్రహించిన బాధితులు బుధవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమాలో వేషాల కోసం తమతో పాటు చాలా మంది డబ్బులు చెల్లించారని వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

>
మరిన్ని వార్తలు