మజ్లిస్ ఓటు బ్యాంకుకు గండి!

9 Feb, 2016 00:56 IST|Sakshi
మజ్లిస్ ఓటు బ్యాంకుకు గండి!

పాతబస్తీలో తగ్గిన ఓట్లు
20 నెలల్లో 1.43 లక్షలు తేడా
బలపడుతున్న అధికార టీఆర్‌ఎస్

 
సిటీబ్యూరో: పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పట్టు సడలిందా? ప్రజ ల చూపు ఆ పార్టీ పైనుంచి అధికార టీఆర్‌ఎస్ వైపు మళ్లుతోందా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాతబస్తీలో మజ్లిస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినా... ఓటు బ్యాంక్‌కు మాత్రం గట్టి దెబ్బ తగిలింది. కేవలం 20 నెలల వ్యవధిలోనే సుమారు 1.43 లక్షల ఓట్లకు గండి పడింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అక్కడ పాగా వేయలేకపోయిన్పపటికీ అనూహ్యంగా మజ్లిస్ ఓట్లను రాబట్టగలిగింది. గతంతో పొల్చితే మజ్లిస్ ఓట్లు గణనీయంగా తగ్గగా... టీఆర్‌ఎస్ బాగా పుం జుకుంది. దశాబ్దాలుగా పాతబస్తీలో తిరుగులేని శక్తిగా మారిన మజ్లిస్‌కు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాతబస్తీలోని 8 నియోజకవర్గాలకు కలిపి మజ్లిస్ పార్టీకి 5,75,537 ఓట్లు లభించగా... తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం 4,41,605 ఓట్లకే పరిమితమైంది. వచ్చే మూడేళ్లలో మరింతగా ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారీ వ్యత్యాసం
తాజా ఎన్నికల ఫలితాలను బట్టి నియోజకవర్గాల వారీ గా పరిశీలిస్తే.. కార్వాన్‌లో అత్యధికంగా మజ్లిస్ ఓట్లకు గండి పడింది. బహదూర్‌పురా, మలక్‌పేటలో సైతం భారీగా ఓట్లు కోల్పోయింది. కార్వాన్‌లో 32,084 ఓట్లు, బహదూర్‌పురాలో 27,268, మలక్‌పేటలో 23,361, చాంద్రాయణగుట్టలో 17,253, రాజేంద్రనగర్‌లో 16, 944, యాకుత్‌పురాలో 10,986, చార్మినార్‌లో 8,060, నాంపల్లిలో 7,976 ఓట్లకు గండి పడినట్లు తెలుస్తోంది.
 
మజ్లిస్ పార్టీకి నియోజకవర్గాల వారీగా లభించిన ఓట్లు

నియోజకవర్గం       2014             2016
మలక్‌పేట              58,976              35,615
చార్మినార్               62,941              54,881  
యాకుత్‌పురా         66,843              55,857
చాంద్రాయణగుట్ట      80,393              63,140
బహుదుర్‌పురా       1,06,874           79,606
నాంపల్లి                 64,066              56,090
కార్వాన్                86,391               54,307
రాజేంద్రనగర్           49,053             32,109
 
 

మరిన్ని వార్తలు