స్కూళ్ల వారీగానే ఫీజులు!

5 Apr, 2017 00:33 IST|Sakshi
స్కూళ్ల వారీగానే ఫీజులు!

- ఆదాయ వ్యయాలను బట్టే నిర్ధారించాలని ప్రాథమిక నిర్ణయం
- జీవో 1 నిబంధనల్లో మార్పులు చేయండి
- నియంత్రణ కమిటీకి విజ్ఞప్తి చేసిన ప్రైవేటు యాజమాన్యాలు
- నిబంధనలు కఠినంగా ఉండాలన్న తల్లిదండ్రుల సంఘాలు
- రేపు మరోసారి భేటీ.. 20న ప్రభుత్వానికి నివేదిక  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఫీజులను ఆయా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టే నిర్ధారించాలని ఫీజుల నియంత్రణ కమిటీ భావి స్తోంది. వృత్తి విద్యా కాలేజీల తరహాలోనే పాఠశాలల ఆదాయ, వ్యయాలపై కిందటి సంవత్సరపు ఆడిట్‌ నివేదికల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తేనే శాస్త్రీ యంగా ఉంటుందన్న యోచనకు వచ్చింది. దీనిపై ఈ నెల 6న ఒకసారి, తరువాత మరోసారి సమా వేశమై చర్చించాలన్న నిర్ణయానికి వచ్చింది. మొత్తం గా ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై తుది నివేదికను సిద్ధం చేసి.. ఈ నెల 20 లోగా ప్రభుత్వ ఆమోదానికి పంపించనుంది.

నిబంధనలు మార్చండి..
స్కూలు ఫీజుల నియంత్రణ కోసం ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ మంగళవారం పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయంలో భేటీ అయింది. తల్లిదండ్రుల సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపింది. స్కూలు ఫీజుల నియంత్రణకు జీవో నంబర్‌ 1లోని నిబంధనలను యథాతథంగా అమలు చేయవద్దని, వాటిలో మార్పులు చేయాలని ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ కమిటీకి విజ్ఞప్తి చేశాయి.

ఆ జీవో ప్రకారం పాఠశాలలకు ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతాన్ని టీచర్ల వేతనాలకు, 15 శాతం పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు, మరో 15 శాతం పాఠశాల నిర్వహణకు, ఇంకో 15 శాతం నిధు లను టీచర్లు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చిం చాలని... యాజమాన్యాలు కేవలం 5 శాతం సొమ్ము నే లాభంగా తీసుకోవాలన్న నిబంధనను మార్చాలని కోరాయి. యాజమాన్యాల లాభం మొత్తాన్ని 5 శాతం నుంచి పెంచాలని, సంక్షేమానికి వెచ్చించాల్సిన 15 శాతంలో మార్పులు చేయాలన్నాయి. రూ.40 వేల గరిష్ట ఫీజుల విధానం ఉండాలని, ప్రాంతాలను బట్టి 5 కేటగిరీలుగా నిర్ణయించాలని కోరాయి.

ఆదాయాన్ని బట్టే ఫీజులుండాలి..
ఆదాయ వ్యయాలను బట్టే స్కూల్‌ ఫీజులను నిర్ణ యించాలని తల్లిదండ్రుల సంఘాలు కమిటీని కోరా యి. వాటిని పరిశీలించి నిర్ణయించే జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు (డీఎఫ్‌ఆర్‌సీలకు) చట్టబద్ధత కల్పించాలని సూచించాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కమిటీ చైర్మన్‌ తిరుపతిరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రైవేటు స్కూళ్ల ప్రకటనలు నిషేధించా లని.. కరపత్రాలు పంచుకోవచ్చని, యూజర్‌ చార్జీలు ఆప్షన్స్‌గానే ఉండాలని, రూ.500 మించిన ఫీజుల చెల్లింపును ఆన్‌లైన్‌లో లేదా బ్యాంకు చెక్కు ద్వారానే చేయాలని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే స్కూళ్ల గుర్తింపు రద్దు చేసి.. వాటిలోని విద్యార్థులను దగ్గరలోని స్కూళ్లలో చేర్పించాలని, గతంలో మాదిరిగా విద్యా సంవత్సరాన్ని జూన్‌ 12 నుంచే ప్రారం భించాలని.. ఇలా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ అంశాలకు తల్లిదండ్రుల సంఘా లు అంగీకరించగా, ప్రైవేటు యాజమాన్యాల ప్రతిని ధులు వ్యతిరేకించారు. సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్‌ కిషన్, అదనపు డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులు శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఎన్‌రెడ్డి, తల్లిదండ్రుల సంఘాల ప్రతిని ధులు నాగటి నారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు