లక్కీ డ్రా పేరుతో రూ.5 లక్షలకు టోకరా

3 Jun, 2016 19:48 IST|Sakshi

హైదరాబాద్ : లక్కీ డ్రాలో బహుమతి తగిలిందని ఫోన్లు చేస్తూ అమాయకులకు ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న పశ్చిమ బెంగాల్ వాసిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని సత్తార్‌బాగ్‌కు చెందిన జమీలా బేగంకు 00923040019476, 00923366994426, 00923066379229 నంబర్ల నుంచి ఇటీవల కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు. తాము రంజేష్, బాలాజీ, ప్రతాప్‌సింగ్, శిరీష్ పాండేలుగా పరిచయం చేసుకున్నారు. ఎయిర్‌టెల్ లక్కీ డ్రాలో ఆమె ఫోన్ నంబర్ ఎంపికైందని, రూ.25 లక్షలు బహుమతిగా వచ్చాయని చెప్పారు. జమీలా బేగం వారి మాటలను న మ్మింది.

వారు చెప్పినట్లుగా ప్రాసెసింగ్ ఫీజులు, పన్నులు, ఇతర చార్జీల పేరుతో రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆపై వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ సాంకేతిక ఆధారాలను బట్టి కోల్‌కతాకు చెందిన చరణ్‌జిత్ దాస్ నిందితుడిగా గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం దాస్‌ను అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చింది.

మరిన్ని వార్తలు