కారుకు సైడ్ ఇవ్వలేదని పిస్టల్‌తో..

11 Apr, 2016 22:25 IST|Sakshi

సుల్తాన్‌బజార్: తన కారుకు సైడ్ ఇవ్వలేదని అసహనానికి గురైన ఓ వ్యక్తి పిస్టల్తో బెదిరించి ఓబైకిస్ట్ను చితకబాదిన సంఘటన సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... నారాయణగూడకు చెందిన శ్రీనివాస్(49) వాటర్‌వర్క్స్ ఉద్యోగి. తన మిత్రుడి తల్లి మరణించడంతో సోమవారం యాంజాల్ ప్రాంతానికి వెళ్లి వస్తున్నాడు. యాంజాల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చిన శ్రీనివాస్, అక్కడ నుంచి ఒక ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి వస్తున్నాడు. ఈ క్రమంలో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా వద్ద వాహనం ఇంజన్ ఆగిపోయింది. దాని వెనకనే మలక్‌పేట్‌కు చెందిన హబీబ్(33) కారులో వస్తున్నాడు. ద్విచక్ర వాహనం అడ్డుగా ఉండడంతో హారన్ కొట్టసాగాడు.

దీంతో శ్రీనివాస్ ఒక నిమిషం ఆగాల్సిందిగా సైగ చేశాడు. దీంతో అసహనానికి గురైన హబీబ్ కారు దిగివచ్చి తన జేబులో ఉన్న పిస్టల్‌ను తీసి శ్రీనివాస్ కణతకు గురిపెట్టి చంపుతానంటూ చితకబాదాడు. దీంతో చుట్టు పక్కల వారు గుమిగూడారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సుల్తాన్‌బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా హబీబ్ గురిపెట్టిన పిస్టల్‌కు లెసైన్స్ ఉందా.. లేదా.. అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ ఫిర్యాదుతో హబీబ్‌పై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు