‘అవసరం అయితే కేసీఆర్ మాట్లాడతారు’

12 Nov, 2016 19:01 IST|Sakshi
ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలి: కేటీఆర్
 
హైదరాబాద్ : గుంటూరు వైద్య కళాశాలలో మెడికో సంధ్యారాణి ఆత్మహత్యకు కారకులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సంధ్యారాణి తల్లిదండ్రులు శనివారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ వారు .. కేటీఆర్ను కోరారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధించడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్యారాణి తన సూసైడ్ నోట్‌లో పేర్కొందని మంత్రికి సంధ్యారాణి కుటుంబీకులు వివరించారు. మరో రెండు నెలల్లో విద్య పూర్తి అయ్యేదని, అయితే ప్రొఫెసర్ వేధింపులకు ఇలా బలి అయిపోయిందని వాపోయారు. 
 
ఆమె కుటుంబానికి కేటీఆర్ సానుభూతి తెలుపుతూ వెంటనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రొఫెసర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం దారుణమంటూ ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకున్నా నిందితురాలికి శిక్ష పడాలని కోరారు. అలాగే ఏపీ డీజీపీ సాంబశివరావుతోనూ ఫోన్‌లో మాట్లాడి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితురాలిని వెతికి పట్టుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
 
కాగా, ఈ విషయంలో మృతురాలి కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఈమేరకు ఏపీ వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చి వచ్చామని, దాన్ని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. లక్ష్మి భర్తను కూడా ఉద్యోగం నుంచి తప్పిస్తామన్నారు. అవసరమైతే ఏపీ సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడతారని సంధ్యారాణి కుటుంబానికి కేటీఆర్ హామీ ఇచ్చారు.

 

>
మరిన్ని వార్తలు