'ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన'

24 Apr, 2016 18:51 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిని దేశంలో నంబర్ వన్ పార్టీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ దిశలోనే ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో పార్టీ 15వ ప్లీనరీని నిర్వహించనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, పార్టీ నాయకుడు సుభాష్‌రెడ్డిలతో కలసి ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను, పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేసేలా ప్లీనరీ ఉంటుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలమంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించామని, ఆహ్వానాలు అందినవారు మాత్రమే ప్రతినిధుల సభకు హాజరు కావాలని ఈటల సూచించారు. వివిధ అంశాలపై ఈ ప్లీనరీలో చర్చ జరిపి కొత్త ఒరవడికి నాంది పలుకుతామని తెలిపారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. వచ్చే ఏడాది జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు