నీటివనరులపై పట్టున్న వ్యక్తి ప్రకాశ్‌

26 Mar, 2017 03:24 IST|Sakshi
నీటివనరులపై పట్టున్న వ్యక్తి ప్రకాశ్‌

మంత్రి హరీశ్‌రావు కితాబు
రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి. ప్రకాశ్‌రావుకు టీటా ఘన సన్మానం
తెలంగాణ ఉద్యమంలో ప్రకాశ్‌ పాత్రను కొనియాడిన వక్తలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నీటి వన రుల గురించి సమగ్ర పట్టున్న వ్యక్తి వి. ప్రకాశ్‌రావు అని రాష్ట్ర నీటిపారుదల, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి. హరీశ్‌ రావు కొనియాడారు. తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ (టీఐటీఏ) ఆధ్వ ర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌  ప్రకాశ్‌ రావుకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ నీటివనరుల గురించి ఉద్యమ సమయంలో ప్రకాశ్‌రావు విశ్లేషించిన అంశాలు తమకు ఎంతో సమాచారాన్ని అందించాయన్నారు.

మ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల జలదోపిడీ గుట్టు విప్పి విడమరచి చెప్పార న్నారు. సీఎం కేసీఆర్‌ స్వప్నమైన కోటి ఎకరాలకు సాగునీరు సాకారానికి ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో జలవనరుల అభివృద్ధి సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. స్పీకర్‌ మధుసూదనా చారి మాట్లాడుతూ ప్రొఫెసర్‌ జయశంకర్‌ శిష్యులుగా ప్రకాశ్‌రావుతో కలసి తాను తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుకు నడిచానని, తెలంగాణ సాధనలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని ప్రశంసించారు. టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్‌ మక్తాలా మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ సాధనలో ప్రకాశ్‌ రావు క్రియాకీల పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం ప్రకాశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని, స్వయం సమృద్ధిగల రాష్ట్రంగా ఎదగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ కలలుగంటున్న కోటి ఎకరాల సాగుభూమిని ఆచరణాత్మకంగా చూపడంలో కీలక భాగస్వామినవుతానన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు సాగుభూమి 25 వేల ఎకరాలే ఉండేదన్నారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా తెలంగాణలోని సాగుభూమి విస్తీర్ణం పెద్ద ఎత్తున పెరిగిందని ఆయన విశ్లేషించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌రావును టీటా సభ్యులతోపాటు పలువురు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సి.లక్ష్మారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, బుర్రా నర్సయ్యగౌడ్, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, కేంద్ర సమాచార హక్కు కమిషనర్‌ మాడభూషి శ్రీధర్, సిటీ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి, సీఎం సీపీఆర్వో జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు