నీ అంతు చూస్తా...

9 Nov, 2014 23:32 IST|Sakshi

ఎమ్మెల్యేను బెదిరించిన టీఆర్‌ఎస్ నాయకుడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
 

చందానగర్: అధికారిక కార్యక్రమానికి పార్టీ నేతలను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే అంతుచూస్తానని బెదిరించాడో టీఆర్‌ఎస్ నాయకుడు. రాష్ట్ర మంత్రి సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో సదరు ఎమ్మెల్యే తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు.  చందానగర్ సీఐ వాసు కథనం ప్రకారం... చందానగర్‌లో ఆదివారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగానికి ముందు నాయకులందరి పేర్లూ సంభోదించారు. అయితే, వేదిక ముందు ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కొమరగౌని శంకర్ గౌడ్ పేరు ప్రస్థావించలేదంటూ ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

దీంతో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోక్యం చేసుకొని... ఇది అధికార కార్యక్రమం, ఆయన ను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది.  శంకర్ గౌడ్ నీకెందుకూ... కూర్చో అంటూ... ఎమ్మెల్యేను వేదికపైనే అన్నాడు. మంత్రి జోక్యం చేసుకొని ఇద్దరినీ సముదాయించారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేసేందుకు వేదిక దిగి కిందకు వ చ్చారు. మంత్రి, ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేస్తుండగా ‘నీ సంగతి చూస్తా...అని దుర్భాషలాడుతూ బెదిరించినట్లు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 పోటాపోటీ నినాదాలు...
 కార్యక్రమం ముగించుకొని బయటకి వచ్చిన ఎమ్మెల్యే గాంధీని చూస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ.. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు దీనికి ప్రతిగా నినాదాలు చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపివేయడంతో ఉద్రిక్తత సడలింది.
 
 

మరిన్ని వార్తలు