డ్రగ్స్‌ రాకెట్‌లో ఉన్న నేతలెవరో చెప్పండి

22 Jul, 2017 01:31 IST|Sakshi
డ్రగ్స్‌ రాకెట్‌లో ఉన్న నేతలెవరో చెప్పండి
ఉత్తమ్, దిగ్విజయ్‌కి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌ 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాభివృద్ధిని చూసి కొంతమంది ఢిల్లీ పెద్ద మనుషులు ఓర్చుకోలేక పోతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. దమ్ముంటే డ్రగ్స్‌ రాకెట్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరున్నారో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ బయటపెట్టాలని, 24 గంటల్లో విచారణ జరిపి వారిని అరెస్టు చేయిస్తామని సవాలు విసిరారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యా లయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పేకాట క్లబ్బులు మూయించింది, మియాపూర్‌ భూకుంభకోణాన్ని బయట పెట్టింది తమ ప్రభుత్వమేనని తెలిపారు. పేకాటక్లబ్బులను, గుడంబా తయారీని ప్రోత్సహిం చింది, నడిపించింది కాంగ్రెస్‌ నేతలు కాదా అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఎవరెన్నీ ట్వీట్లు పెట్టినా తమను ఎవరూ ఏం చేయలేరన్నారు.
మరిన్ని వార్తలు