హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పరిధిలోని జహంగీరాబాద్, వాదే పరాన్ బస్తీలలో గుడుంబాను నిర్మూలించేందుకు పోలీసులు మొహల్లా కమిటీను ఏర్పాటుచేశారు. చాంద్రాయణగుట్ట పోలీసులు బుధవారం రాత్రి ఈ రెండు బస్తీలలో సమావేశం నిర్వహించారు.
గుడుంబా విక్రయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. గుడుంబా నిర్మూలన కోసం స్థానికులు సహకరించాలని అధికారులు సూచించారు. దీనికి ప్రజలు అంగీకరించడంతో మొహల్లా కమిటీని ఏర్పాటు చేశారు. బస్తీలో నేరాల నివారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మొహల్లా కమిటీకి అనుగుణంగా పోలీస్స్టేషన్ తరపున ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో టీం ఏర్పాటు చేశారు.