జయప్రద కుమారుడి రిసెప్షన్‌కు ములాయం

29 Nov, 2015 23:13 IST|Sakshi
జయప్రద కుమారుడి రిసెప్షన్‌కు ములాయం

సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, సినీనటి జయప్రద కుమారుడి వివాహ విందులో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సందడి చేశారు. జయప్రద ఆహ్వానం మేరకు ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఆదివారం నగరానికి చేరుకున్న ములాయంసింగ్ యాదవ్ నేరుగా మాదాపూర్‌లోని జయప్రద ఇంటికి వెళ్లారు. ఆ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్ కూడా ములాయం వెంట ఉన్నారు. వారికి జయప్రద కుటుంబ సభ్యులు సాదరస్వాగతం పలికారు. నూతన వధూవరులు ప్రవళిక, సిద్ధార్థ్‌లను వారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జయప్రద కుటుంబసభ్యులు వారికి ప్రత్యేక జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం రాత్రి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.

 రాజకీయాలు మాట్లాడ్డం కోసం త్వరలో వస్తా...
 ఈ సందర్భంగా ములాయంసింగ్ యాదవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. జయప్రద కుమారుడి వివాహ విందులో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికలు, తదనంతర రాజకీయ పరిణామాలపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే వచ్చానని, ఇలాంటి వేళ రాజకీయాల గురించి మాట్లాడటం ఉచితం కాదని పేర్కొన్నారు. రాజకీయాలపై మాట్లాడేందుకు త్వరలోనే మరోసారి వస్తానని అన్నారు.

మరిన్ని వార్తలు