జీహెచ్‌ఎంసీ ఉద్యోగిపై హత్యాయత్నం

27 Feb, 2016 04:02 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ ఉద్యోగిపై హత్యాయత్నం

కత్తులతో బీభత్సం
 
 హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఉద్యోగి మచ్చ సాయికుమార్(32) ఇంటిపై గురువారం రాత్రి మద్యం మత్తులో కొందరు వ్యక్తులు కత్తులు, సీసాలతో దాడి చేశారు. భోలక్‌పూర్ కృష్ణానగర్‌లో ఆయన నివాసముంటున్నారు. అడ్డువచ్చిన సాయి అక్క, చెల్లెళ్లు స్వప్న, శోభలనూ గాయపరిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరుడు టి.శ్రీనుతో పాటు అతని కుమారులు సంకేత్, సిద్ధు, సోదరుడు సంతోష్, మనోజ్, జేసుమన్, విక్రమ్ ఈ దాడిలో పాల్గొన్నట్లు గాంధీనగర్ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 11 గంటల తర్వాత సాయి ఇంటికి వచ్చిన వీరు సుమారు 40 నిమిషాల పాటు బీభత్సం సృష్టించారు.

గాంధీనగర్ పోలీసులు సాయికుమార్‌ను ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరి స్థితి స్థిమితంగా ఉన్నట్లు పోలీసులు తెలి పారు. కొన్ని రోజుల క్రితం సంకేత్, సిద్ధులకు బాధితుడి అల్లుడు రోమీ మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. నిందితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశామని చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య చెప్పారు. కాగా, చికిత్స పొందుతున్న సాయికుమార్‌ను శుక్రవారం మంత్రి తలసాని, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పరామర్శించారు. తనకీ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని తన పేరు ప్రస్తావిస్తున్నాయని తలసాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ తన బంధువులు, అనుచరులెవరైనా తప్పు చేస్తే చట్టం ముందు అంతా సమానులేనన్నారు. మంత్రి ప్రోద్బలంతోనే ఆయన కుటుంబీకులు దౌర్జన్యాలు చేస్తున్నారని శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

మరిన్ని వార్తలు